Viral Video: ఫేస్ బుక్‌లో పరిచయం అయిన బాయ్‌ఫ్రెండ్ నస్రుల్లాతో భారతీయ మహిళ అంజు పాకిస్థాన్ చుట్టేస్తోంది. అతడితో పర్యాటక ప్రాంతాలకు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. నిన్న అంజు నస్రుల్లా పర్యాటక ప్రాంతంలో ప్రేమ పావురాల్లా విహరిస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అంజు నస్రుల్లా, అతని స్నేహితులతో కలిసి డిన్నర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారంతా కలిసి డిన్నర్ టేబుల్ పై కూర్చొని ఉన్నట్లు వైరల్ అవుతున్న వీడియాల్లో కనిపిస్తోంది. అంజు బురఖా ధరించినట్లు చూస్తే అర్థం అవుతోంది. ఈ వీడియోలో అంజు నస్రుల్లా జంటతో పాటు పలువురు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా కలిసి డిన్నర్ చేస్తున్నట్లు తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఈ 15 సెకన్ల వీడియోను దిలీప్ కుమార్ పాక్ అనే యూజర్ నేమ్ తో ఉన్న దిలీప్ కుమార్ ఖత్రీ అనే వ్యక్తి జులై 27వ తేదీన మధ్యహ్నం 12.21 గంటలకు పోస్టు చేశాడు. భార్యను స్నేహితులకు పరిచయం చేసి వారితో కలిసి భోజనం చేయడం పష్తున్ హోమ్స్ సాంప్రదాయం అంటూ దిలీప్ కుమార్ తన పోస్టుపై రాసుకొచ్చారు. 


అంజు నస్రుల్లా విహరిస్తున్న వీడియోలు వైరల్


మంగళవారం రోజు వీరిద్దరూ పాకిస్థాన్‌ లోని గిరిజన ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ దిర్ జిల్లా చుట్టూ తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి మాత్రమే కాదు అంజు ఇస్లాం మతంలోకి మారిందని, నస్రుల్లాను వివాహం చేసుకున్నట్లు కొన్ని పాకిస్థాన్‌ వార్తా సైట్‌లు తెలిపాయి. అయితే అంజు, నస్రుల్లా ఇద్దరూ ఈ వాదనలను "పుకార్లు"గా పేర్కొంటూ ఖండించారు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. అంజు ఇస్తాం మతంలోకి మారి తన పేరును ఫాతిమాగా మార్చుకున్న వార్తలు కూడా తప్పని కొట్టి పారేశారు. 


అంజుతో తనకు ఇంకా పెళ్లి కాలేదని.. అసలీ తప్పుడు వార్తలన్నీ ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తనకు అర్థం కావడం లేదని నస్రుల్లా వివరించారు. తమకు ఆపద ఉన్నందున కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. అంజు విదేశీయురాలు కావడంతో ప్రభుత్వం తమకు 50 మంది పోలీసు అధికారుల భద్రతను కూడా కల్పించిందన్నారు. అంజు పాకిస్థాన్‌లో విదేశీయురాలని.. అందుకే ఆమె ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిపారు. ఆమెపై ఎప్పుడైనా దాడి జరగవచ్చని.. ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారని పేర్కొన్నారు. అందుకే ఆమెకు రక్షణ కల్పించాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. తమకు ఇంకా పెళ్లి కాలేదని.. వివాహ ధ్రువీకరణ పత్రంగా చూపిస్తున్న పేపర్ అంతా అబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అంజు తన ప్రాణ స్నేహితురాలు మాత్రమేనని, పాకిస్థాన్ చూడాలనే ఆశతో ఆమె టూరిస్ట్ వీసాపై ఇక్కడకు వచ్చారని అన్నారు.