Working-Age Populations: రాబోయే రోజుల్లో ఎకనామిక్ జాగ్రఫీ తూర్పు దేశాలవైపు మారబోతున్నట్లు మెకిన్సే తన నివేదికలో వెల్లడించింది. డ్రైవింగ్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ జీ20 ఎకనామిస్ నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. జనాభాలో పని చేసే సత్తువ గల వయస్సులో ఉన్న వారు అధికంగా ఉన్న 5 దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలవనుందని మెకిన్సే తన నివేదికలో పేర్కొంది. 2030 నాటికి భారత్ లో యుక్త వయస్సు నుంచి మధ్య వయస్సు గల వారి సంఖ్య అధికంగా ఉంటుందని తెలిపింది. ప్రపంచంలో ఈ వయస్కులు అత్యధికంగా ఉండే 5 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు గల దేశాల్లో భారత్, చైనా, ఇండోనేషియా ఉంటాయి. అయితే ఈ మూడు దేశాలు జీ20లో ఉన్నాయి. దీనిని బట్టి ఎకనామిక్ జాగ్రఫీ వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఈస్టర్న్ కంట్రీస్ వైపు మారబోతున్నట్లు అర్థం అవుతోందని మెకిన్సే తన నివేదికలో పేర్కొంది. 


డిజిటల్, డేటా ప్రసారం వల్ల కమ్యూనికేషన్, విజ్ఞానం పరస్పర మార్పిడి జరుగుతుందని శనివారం విడుదలైన తన నివేదికలో తెలిపింది. దీని వల్ల దేశాలు.. ఒకదానిపై ఒకటి ఆధారపడే పరిస్థితి మరింత ఎక్కువ అవుతుందని పేర్కొంది. ప్రపంచం నవ శకం అంచున, మేలి మలుపు అంచున ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సూచిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. భవిష్యత్తులో ఆర్థిక కేంద్రాలు మారే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అలాగే జీ20 దేశాల్లో సుస్థిరత, సమ్మిళితత్వం విస్తృతమైన, విభిన్నమైన ధోరణులు కనిపిస్తున్నట్లు తెలిపింది. జీ20 దేశాల్లో ఆర్థిక సాధికారత రేఖకు దిగువన 2.6 బిలియన్ల మంది ఉన్నారని మెకిన్సే నివేదిక పేర్కొంది. ప్రపంచంలో 4.7 బిలియన్ల మంది, భారత్ లో 1.07 బిలియన్ల మంది ఈ రేఖకు దిగువన ఉన్నారంది. అంటే ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనం ఆర్థిక సాధికారత రేఖకు దిగువనే ఉంటారని వెల్లడించింది.


ఈ ఆర్థిక వ్యత్యాసాలను తొలగించడానికి 2021-2030 దశాబ్దంలో జీ20 దేశాలు అదనంగా 21 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. భారత దేశం ఈ వ్యత్యాసాన్ని తొలగించడం కోసం ఈ దశాబ్దంలో 5.4 ట్రిలియన్ డాలర్లు, అంటే తన జీడీపీలో 13 శాతం ఖర్చు చేయాలని పేర్కొంది. చైనా 4.8 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని సూచించింది. జీ20 వృద్ధికి చైనా, భారత్ లు ఇంజిన్ లుగా ఉంటాయని, అయితే ఇతర దేశాల చేరిక, స్థిరత్వంపైనే మెరుగైన స్కోరును సాధించగలవని రిపోర్టు పేర్కొంది. జీ20 ఆర్థిక వ్యవస్థల్లో 2.6 బిలియన్ల మంది ఆర్థిక సాధికారత రేఖకు దిగువన జీవిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇందులో 100 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిపింది.


దక్షిణాఫ్రికా, భారత్ జనాభాలో మూడు వంతుల కంటే ఎక్కువ మంది ఆర్థిక సాధికారత రేఖకు దిగువన నివసిస్తున్నట్లు మెకిన్సే రిపోర్టు పేర్కొంది. 2020 నాటికి భారత దేశ జనాభాలో 77 శాతం మంది ప్రజలు, దక్షిణాఫ్రికా జనాభాలో 75 శాతం మంది ప్రజలు ఆర్థిక సాధికారత రేఖకు దిగువన నివసిస్తున్నట్లు మెకిన్సే నివేదిక తెలిపింది. చైనా, మెక్సికో, బ్రెజిల్, ఇండోనేషియా దేశాల్లో ఈ సంఖ్య 50 శాతం కంటే ఎక్కువే ఉన్నట్లు పేర్కొంది. ఐరోపా, ఉత్తర అమెరికాలో ఇది 20 నుంచి 30 శాతం వరకు ఉన్నట్లు రిపోర్టు తెలిపింది.


భారత్ అమలు చేస్తున్న 8 కార్యక్రమాలు ప్రజలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతున్నట్లు మెకిన్సే నివేదిక పేర్కొంది. అవేంటంటే..



  • జన్‌దన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ (JAM) లను ఉపయోగించడం వల్ల ఆర్థిక కార్యక్రమాలు అట్టుడుగు వారికి చేరువ అవుతున్నాయి. అలాగే ఆర్థిక పంపిణీలో పారదర్శకత పెరిగింది.

  • ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు

  • కోవిన్ పోర్టల్

  • అపోలో హాస్పిటల్స్ అమలు చేస్తున్న ఓమ్ని-చానల్ హెల్త్ కేర్ సర్వీసులు

  • ప్రభుత్వం కల్పిస్తున్న చిరు ధాన్యాలపై అవగాహన

  • సౌర విద్యుత్ రంగంలో సామర్థ్యం పెంపు

  • ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వృద్ధి

  • వ్యర్థాల నిర్వహణ విధానాలు