I.N.D.I.A Alliance: జట్టు కట్టినా, పొత్తు పెట్టినా ఓ పార్టీల మధ్యనైనా సీట్ల పంపకం అనేది పెద్ద పంచాయితీ. కూటమిలోని పార్టీలు సమ ఉజ్జీలుగా ఉంటే సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక మరింత సవాలుగా ఉంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని I.N.D.I.A పేరుతో జట్టు కట్టిన 28 పార్టీల మధ్య సీట్ల పంపకం అనేది ఏమంత సులభంగా అయ్యేలా లేదు. ఈ కూటమిలో కొన్ని పార్టీల మధ్య, మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో సీట్ల పంపకం చాలా కఠినంగా ఉండనుంది. 


ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 28 పార్టీల కూటమి సీట్ల పంపకాన్ని ఫైనల్ చేసేందుకు చేరువైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన(UBT) ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్నాయి. బిహార్, జమ్మూ కశ్మీర్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చు. కానీ కొన్ని రాష్ట్రాల్లో సీట్ల పంపకం మాత్రం సవాలుగా మారనుంది. బెంగాల్ లో అధికార తృణమూల్, కాంగ్రెస్, సీపీఐ మధ్య ఎలాంటి పొత్తు లేదు. తాజాగా  I.N.D.I.A కూటమిలో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకంలో కొత్త ఇబ్బంది తప్పదని రాజకీయ నిపుణులు అంటున్నారు.


లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనేది ఈ సీట్ల పంపకాల ఉమ్మడి లక్ష్యం. ఎటువంటి భేషాజాలకు పోకుండా ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్తేనే బీజేపీని ఢీకొట్టగలమని భావిస్తున్న కూటమి నేతలు ఈ సారి బలమైన అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. 


ప్రతిపక్ష I.N.D.I.A కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం నిన్న జరిగింది. పార్టీల మధ్య సీట్ల పంపకం, రాబోయే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ముంబయి వేదికగా I.N.D.I.A కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎటువంటి భేషాజాలకు పోకుండా ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్తేనే బీజేపీని ఢీకొట్టగలమని భావిస్తున్న కూటమి నేతలు ఈ సారి బలమైన అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జరిగిన మొదటి సమన్వయ కమిటీ సమావేశంలో సీట్ల షేరింగ్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి పోటీకి నిలబెట్టడానికి ఈ సమావేశం జరిగింది.


14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది. కూటమిలో ఏ నిర్ణయం అయినా ఈ కమిటీనే తీసుకుంటుంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారన్న వార్తల నేపథ్యంలో వీలైనంత తొందరగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని I.N.D.I.A కూటమి భావిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లోని సీట్ల పంపకమే సమన్వయ కూటమికి సవాలుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.