Independence Day 2023: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మధ్యప్రదేశ్ లో అపశృతి చోటుచేసుకుంది. త్రివర్ణ పతాకం ఎగురవేసి వందనం చేసే క్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి స్పృహతప్పి వేదిక మీదే పడిపోయారు. ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా హర్ గర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన త్రివర్ణ పతాక ర్యాలీలో మంత్రి ప్రభురామ్ పాల్గొన్నారు. విద్యార్థులు, పోలీసులు, అధికారులతో సహా ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ఈ ర్యాలీలు నిర్వహించారు. ఈ త్రివర్ణ పతాక ర్యాలీ కార్యక్రమాలను ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురామ్ చౌదరి స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు.


ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ప్రభురామ్ చౌదరి చాలా చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వేదికపైకి వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న క్రమంలో స్పృహతప్పి కింద పడిపోయారు. ఆయన పట్టుకోల్పోతుండటాన్ని ముందే గమనించిన పోలీసుల సిబ్బంది ఆయనను కాసేపు పట్టుకున్నారు. అంతలోనే మంత్రి పూర్తిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. వెంటనే ప్రభురామ్ చౌదరిని పోలీసు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మంత్రికి రక్తపోటు ఎక్కువగా ఉండి షుగర్ లెవల్స్ తగ్గి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి వైద్యుల సమక్షంలోనే ఉన్నారు. ప్రస్తుతం ప్రభురామ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.






స్పృహ తప్పి పడిపోయిన అసెంబ్లీ స్పీకర్ 
అటు అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా స్పృహ తప్పి పడిపోయారు. జెండా ఎగుర వేసి గౌరవ వందనం చేసిన తర్వాత స్టేజి పై ఏర్పాటు చేసిన పోడియం వద్దకు వచ్చి మాట్లాడుతున్న క్రమంలోనే గిరీష్ గౌతమ్ స్పృహ తప్పి కింద పడి పోయారు. పక్కనే ఉన్న అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి స్పీకర్ గిరీష్ గౌతమ్ ను పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. కొద్దిగా గాలి వచ్చేలా ఏర్పాటు చేశారు. అనంతరం అందుబాటులో ఉన్న వైద్యులను పిలిపించారు. వారు స్పీకర్ గిరీష్ గౌతమ్ ను పరీక్షించి తాత్కాలిక చికిత్సలో భాగంగా గ్లూకోజ్ ఎక్కించారు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ ను సంజయ్ గాంధీ ఆస్పత్రి రీవాకు తరలించారు. 


Also Read: Mallikarjun Kharge: ఎర్రకోట వేడుకకు మల్లికార్జున్ ఖర్గే గైర్హాజరు, ఖాళీ కుర్చీల ఫొటోలు పోస్టు చేసిన కాంగ్రెస్