PUBG Love Story: 



బెయిల్‌పై బయటకి..


పబ్‌జీలో పరిచయమైన యువకుడి కోసం వచ్చిన పాక్‌ మహిళ కథ ఎన్నో మలుపులు తిరుగుతోంది. జులై 4వ తేదీన ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. తరవాత బెయిల్ వచ్చింది. జైలు నుంచి వచ్చాక కూడా ఆమె మనసు ఏమీ మారలేదు. ఆ యువకుడితోనే కలిసుంటానని చెబుతోంది. ఇక ఆ యువకుడిపైనా కేసు నమోదైంది. అయినా కూడా ఇద్దరూ "మేం కలిసే బతుకుతాం" అని తేల్చి చెబుతున్నారు. "నా భర్త హిందూ. అంటే నేను కూడా హిందువునే. నేను ఇండియన్‌నే అని అనిపిస్తోంది" అని స్పష్టం చేసింది సీమా హైదర్. కొవిడ్ ప్యాండెమిక్‌ టైమ్‌లో పబ్‌జీ గేమ్ ద్వారా వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో నేపాల్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. సీమా హైదర్‌కి 30 ఏళ్లు కాగా...యువకుడు సచిన్‌కి 25 ఏళ్లు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని నేపాల్‌లోనే ఒక్కటయ్యారు. ఆ తరవాత నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా ఇండియాకి వచ్చేసింది సీమా. 


"చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. బాగా భయం వేసింది. కరాచీ నుంచి దుబాయ్‌కి వెళ్లాను. అక్కడే కంటిమీద కునుకు లేకుండా 11 గంటల పాటు గడిపాం. అక్కడి నుంచి నేపాల్‌కి వచ్చాం. పోఖ్రాకి చేరుకునే ముందు సచిన్ నన్ను కలిశాడు. అప్పుడే తొలిసారి కలుసుకున్నాం" 


- సీమా హైదర్ 


ఇలా జరిగిందట..


అలా తొలిసారి కలుసుకున్నాక ఆమె మళ్లీ పాకిస్థాన్‌కి వెళ్లిపోగా సచిన్ ఇండియాకి వచ్చేశాడు. కానీ...భర్తతో కలిసుండటానికి ఆమె ఇష్టపడలేదు. "మా ఇద్దరికీ ఎందుకో కుదరలేదు" అని చెప్పింది. భర్తకి తెలియకుండా ఇల్లు అమ్మేసి రూ.12లక్షలు సంపాదించుకుంది. ఆ డబ్బుతోనే నేపాల్‌కి ఫ్లైట్‌లో వచ్చింది. ఈ ఏడాది మే నెలలో దుబాయ్ మీదుగా నేపాల్‌కి చేరుకుంది. పోఖ్రాన్‌లో కాసేపు ఉండి..అక్కడి నుంచి ఖాట్మండు నుంచి ఢిల్లీకి బస్‌లో వచ్చింది. మే 13న సచిన్ ఆమె కోసం ఇల్లు తీసుకున్నాడు. "నెలల పాటు ఇలా జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుందేమో అని చాలా భయపడ్డాను. బెయిల్ వచ్చిందని తెలియగానే ఎగిరి గంతేశాను" అని చెబుతోంది సీమా హైదర్. 


భర్త రిక్వెస్ట్..


సీమా భర్త ఓ వీడియో విడుదల చేశాడు. తన భార్యని సేఫ్‌గా పాకిస్థాన్‌కి పంపేయాలని వేడుకున్నాడు. సౌదీలో ఉంటున్న ఆమె భర్త ఓ వీడియోతో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాడు. ఇండియన్ మీడియా చాలా సపోర్ట్ చేసిందని అన్నాడు. 


"నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నాదో విజ్ఞప్తి. దయచేసి మా ఆవిడని, పిల్లలను పాకిస్థాన్‌కి పంపేయండి. వాళ్ల ఇంటికి సురక్షితంగా చేర్చండి. నా భార్యను ఎవరో ట్రాప్ చేశారు. కావాలనే పరిచయం పెంచుకుని ఇండియాకి రప్పించారు. ఇండియన్ మీడియా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇది నేను ఊహించలేదు. వాళ్ల వల్లే నా భార్య ఎక్కడుందో తెలిసింది. మోదీజీ...చేతులు జోడించి వేడుకుంటున్నాను. మా కుటుంబాన్ని కలపండి"


- గులామ్ హైదర్ 


Also Read: Agnipath Scheme: అగ్నివీర్‌ స్కీమ్‌పై ఆసక్తి తగ్గుతోందా! ట్రైనింగ్ మధ్యలోనే వచ్చేస్తున్న యువత