సల్మాన్‌కు బెదిరింపులు,  భద్రత పెంచిన ప్రభుత్వం 


కాంగ్రెస్ నేత, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడు. విచారణలో మరో సంచలన నిజం బయటకు వచ్చింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను చంపేందుకు కుట్ర జరిగిందని తేల్చి చెప్పాడు బిష్ణోయ్. గతంలో ఓ సారి సల్మాన్‌ను చంపేందుకు రెక్కీ నిర్వహించానని, కానీ హత్య చేయటం కుదరలేదని వెల్లడించినట్టు "ఇండియా టుడే" వార్తా సంస్థ పేర్కొంది. ఇదంతా జరగక ముందే
సల్మాన్ ఖాన్‌కు ఇటీవల చంపుతామని బెదిరింపులు వచ్చాయి. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రత పెంచింది. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పోలీసులకు వెల్లడించిన నిజాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన ఇంటరాగేషన్ కాపీని తాము సేకరించినట్టు ఇండియా టుడే వార్తా సంస్థ వెల్లడించింది. 2021లోనే పోలీసులు ఈ విషయమై బిష్ణోయ్‌ను విచారించగా అప్పుడే నిజం అంగీకరించినట్టు ఈ ఇంటరాగేషన్ కాపీలో ఉన్నట్టు ఇండియా టుడే పేర్కొంది. 


సల్మాన్‌ను చంపాలని చూశాం: గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్
2021లోనే బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ను చంపేందుకు రాజస్థాన్‌ గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రాను నియమించినట్టు విచారణలో బిష్ణోయ్ వెల్లడించారని కాపీలో పేర్కొన్నట్టు చెప్పింది ఇండియా టుడే సంస్థ. బిష్ణోయ్ ఆదేశాల మేరకు సంపత్ నెహ్రా ముంబయి వెళ్లాడు. 
సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్టు బిష్ణోయ్ విచారణలో పేర్కొన్నట్టు కాపీలో ఉందని ఇండియా టుడే పేర్కొంది. రెక్కీ నిర్వహించిన సమయంలో చిన్న పిస్టల్ ఉండటం వల్ల సల్మాన్‌ను చంపటం కుదరలేదని సంపత్ నెహ్రా..బిష్ణోయ్‌కు చెప్పినట్టు విచారణలో తేలింది. దినేష్ ఫౌజీ అనే వ్యక్తి నుంచి ఆర్‌కే స్ప్రింగ్ రైఫిల్‌ను కొనుగోలు చేసి నెహ్రాకు అందజేయాలని చూశాడు బిష్ణోయ్. ఇందుకోసం తన అసిస్టెంట్‌కు 3-4లక్షల రూపాయలు ఇచ్చినట్టు విచారణలో చెప్పాడని ఇండియా టుడే చెప్పింది. ఈలోగా పోలీసులు ఆ గన్‌ను ట్రేస్ చేసి ఫౌజీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్న బిష్ణోయ్‌ను సల్మాన్‌కు ఇటీవల మరోసారి బెదిరింపులు రావటంపై విచారణ జరుపుతున్నారు. సల్మాన్ ఖాన్ తండ్రిని కూడా చంపుతామని బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపైనా బిష్ణోయ్‌ను ప్రశ్నిస్తున్నారు. "నీకూ మూసేవాలా గతి పడుతుంది" అని  సల్మాన్ ఖాన్‌ బాడీ గార్డ్స్‌కి ఓ లేఖ అందింది. ఆయుధాల అక్రమ రవాణా కేసులో బిష్ణోయ్‌ను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచారు. మూసేవాలా హత్యపై విచారిస్తున్న దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, బిష్ణోయ్‌ను మూడు రోజుల పాటు విచారించేందుకు జైల్ నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. పంజాబ్ పోలీలసులకు తనను అప్పగించకుండా చూడాలని దిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. కానీ అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.