Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునర్నిర్మాణంపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ బుధవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ (పీఈ)ని నమోదు చేసింది. అక్టోబర్ 3లోగా అన్ని పత్రాలను అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ను సీబీఐ ఆదేశించింది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నిర్వహించిన విచారణలో వెలుగులోకి వచ్చిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ అన్ని కోణాల్లోనూ విచారించనుంది.


దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ డైరెక్టర్‌కు మే నెలలో ఐదు పేజీల లేఖ రాశారు. దీని ఆధారంగా కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా దీనిపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 


ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసం పనర్నిర్మాణం, సుందరీకరణ కోసం దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించడంతో వివాదం చెలరేగింది. .న తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో వివాదం చెలరేగింది. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, అక్రమాలకు సంబంధించిన అన్ని రికార్డులు భద్ర పరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. దీనిపై విచారణ జరిపిన చీఫ్ సెక్రటరీ గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించాలని సక్సేనా సీబీఐకి లేఖ రాశారు.