చనిపోయిన వ్యక్తికి రెండో డోసు వేశారు అధికారులు. చనిపోయిన వారికి వ్యాక్సిన్ ఏంటండి అని మీరు అడగకండి... అవును నిజమే మే నెలలో చనిపోయిన వ్యక్తికి.. డిసెంబర్ లో కరోనా వ్యాక్సిన్ వేశారు అధికారులు... వేశాం అన్నట్టుగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దయచేసి వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకోండి అంటూ.. ఫోన్ కు మెసెజ్ కూడా పంపారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే..


మధ్యప్రదేశ్ లోని బియోరాలో పురుషోత్తం అనే వృద్ధుడు.. మే నెలలో చనిపోయాడు. అయితే ఆయన ఫోన్ కు ఇటీవలే.. డిసెంబర్ నెలలో రెండో డోసు పూర్తయిందని.. మెసేజ్ వచ్చింది. వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలని.. సందేశంలో ఉంది. ఇది చూసి ఇంట్లో వాళ్లు షాకయ్యారు.


డిసెంబర్​ 3వ తారీఖున మా నాన్న  ఫోన్ కు సందేశం​ వచ్చింది. వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ను కూడా డౌన్​లోడ్​ చేశాం. మా నాన్న ఏప్రిల్​ 8న మెుదటి డోసు తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత.. వేరే అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇండోర్​లో చికిత్స పొందుతూ మే 24న చనిపోయారు.
                                                                                                          - ఫూల్​ సింగ్​, వృద్ధుడి కుమారుడు.


ఈ విషయం జిల్లా టీకా పంపిణీ అధికారి దృష్టికి వెళ్లింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 'కంప్యూటర్​లో తలెత్తిన లోపంతో అలాంటి మెసేజ్​ వెళ్లి ఉండొచ్చు. టీకా పంపిణీ మెుదలైన సమయం నుంచి.. అనేకమంది ఫోన్​ నంబర్లను తప్పుగా నమోదు చేస్తున్నారు. ఒకవేళ అది కూడా కారణం అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇలాంటి తప్పు జరిగిందని.. గుర్తిస్తాం' అని జిల్లా టీకా పంపిణీ అధికారి  డాక్టర్​ పీఎల్​ భగోరియా చెప్పారు. 


వ్యాక్సినేషన్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందున, ఎవరైనా ఎంట్రీ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసి ఉండవచ్చని బియోరా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరద్ సాహు తెలిపారు. పొరపాటును సరిదిద్దుతామని పేర్కొ్న్నారు. 


ఇదిలా ఉండగా.. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన తప్పుడు డేటాను అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర డాంగి ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ వాదనను బట్టబయలు చేస్తున్నాయని, ఇలాంటి కేసులన్నింటిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు.


Also Read: Night Curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూలు .. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు !


Also Read: Odisha School : సెలవుల కోసం తోటి విద్యార్థులు తాగే నీళ్లలో విషం..అందరూ తాగేశారు ! తర్వాత ఏమయిందంటే ?


Also Read: PM Modi: సైనికుడు మిలటరీలో ఉన్నంతవరకే కాదు.. జీవితాంతం యోధుడే