Covid-19 Alert for India: చైనాలో కరోనా కొత్త వేరియంట్ సృష్టించిన ప్రకంపనల దృష్ట్యా భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. వరుస సమావేశాలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, రాష్ట్రాలతో చర్చిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ రోజు (డిసెంబర్ 23) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు, పెద్ద ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించడంపై చర్చిస్తారు. భారత్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉందని మాండవీయ గురువారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు.


పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ మాట్లాడుతూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం చైనా, భారతదేశం మధ్య ప్రత్యక్ష విమానాలు లేవు, కానీ ప్రజలు ఇతర మార్గాల ద్వారా వస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితిలో వైరస్ భారతదేశంలోకి ప్రవేశించకుండా చూసుకోవడంపై దృష్టి పెడుతున్నామని అన్నారు. అదే సమయంలో ప్రయాణానికి ఎటువంటి అడ్డంకి లేదన్నారు. 


ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వాలతో ప్రధాని మాట్లాడారు. ఈ రాష్ట్రాల్లోని అధికారులు, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా వైరస్ భయం పెరుగుతుండటంతో మాస్కులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. 


ఢిల్లీ ఎయిమ్స్‌లో మాస్కులు ధరించడం తప్పనిసరి


పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఢిల్లీ ఎయిమ్స్‌లో రూల్స్‌ కఠినం చేశారు. దీని ప్రకారం ఎయిమ్స్ సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. క్యాంపస్ లో మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేశారు. ఎయిమ్స్ ప్రాంగణంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని కూడా నిషేధించారు.


యూపీలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి


కోవిడ్ పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సింగ్ను ముందుకు తీసుకెళ్లాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ లు ధరించేలా చూడాలని ఆయన అధికారులను కోరారు.


విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని, జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలతో ఉన్న ప్రయాణీకులను గుర్తించాలని వైద్య విద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించినట్లు యుపి డిప్యూటీ సిఎం, ఆరోగ్య మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు.


కర్ణాటక, కేరళ, బెంగాల్లో అలర్ట్


ఇండోర్ ప్రాంతాలు, క్లోజ్డ్ ప్రదేశాలు, ఎయిర్ కండిషన్డ్ ప్రాంతాల్లో మరోసారి మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్ స్క్రీనింగ్ కూడా చేస్తామని మంత్రి చెప్పారు. అంతేకాకుండా, ముంబైలోని ముంబాదేవి ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని సందర్శించేటప్పుడు మాస్కులు ధరించాలనే ఆదేశాలను పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.


బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం (డిసెంబర్ 21) నిఘా పెంచాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించారు. 2023 జనవరిలో జరిగే గంగా సాగర్ మేళాకు ముందు కరోనా సంక్రమణకు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించాలని ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ, పరిస్థితిని సమీక్షించామని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.