Coronavirus In India: చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా భారత్‌లోనూ కరోనా వైరస్ భయం మళ్లీ మొదలైంది. చైనాలో ఒమిక్రాన్ బిఎఫ్.7కి చెందిన సబ్ వేరియంట్ వినాశనం సృష్టిస్తోంది. ఇప్పుడు భారత్ కూడా ఈ విషయంలో అప్రమత్తమైంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేయడం, జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచడం, కరోనా వ్యాక్సిన్ మూడో మోతాదును ప్రజలకు వీలైనంత త్వరగా ఇవ్వడం సహా కోవిడ్ -19 కోసం సన్నద్ధత, ప్రోటోకాల్స్‌ను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.


ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వాలతో ప్రధాని మాట్లాడారు. ఈ రాష్ట్రాల్లోని అధికారులు, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా వైరస్ భయం పెరుగుతుండటంతో మాస్కులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. 


ఢిల్లీ ఎయిమ్స్‌లో మాస్కులు ధరించడం తప్పనిసరి


పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఢిల్లీ ఎయిమ్స్‌లో రూల్స్‌ కఠినం చేశారు. దీని ప్రకారం ఎయిమ్స్ సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. క్యాంపస్ లో మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేశారు. ఎయిమ్స్ ప్రాంగణంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని కూడా నిషేధించారు.


యూపీలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి


కోవిడ్ పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సింగ్ను ముందుకు తీసుకెళ్లాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ లు ధరించేలా చూడాలని ఆయన అధికారులను కోరారు.


విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని, జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలతో ఉన్న ప్రయాణీకులను గుర్తించాలని వైద్య విద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించినట్లు యుపి డిప్యూటీ సిఎం, ఆరోగ్య మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు.


కర్ణాటక, కేరళ, బెంగాల్లో అలర్ట్


ఇండోర్ ప్రాంతాలు, క్లోజ్డ్ ప్రదేశాలు, ఎయిర్ కండిషన్డ్ ప్రాంతాల్లో మరోసారి మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్ స్క్రీనింగ్ కూడా చేస్తామని మంత్రి చెప్పారు. అంతేకాకుండా, ముంబైలోని ముంబాదేవి ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని సందర్శించేటప్పుడు మాస్కులు ధరించాలనే ఆదేశాలను పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.


బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం (డిసెంబర్ 21) నిఘా పెంచాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించారు. 2023 జనవరిలో జరిగే గంగా సాగర్ మేళాకు ముందు కరోనా సంక్రమణకు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించాలని ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ, పరిస్థితిని సమీక్షించామని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.


తమిళనాడు, జార్ఖండ్ లో అధికార యంత్రాంగం అప్రమత్తత


తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. జార్ఖండ్ లో కరోనా యాక్టివ్ కేసులు లేవు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని కేంద్రం చేసిన సూచనలను పరిపాలన పాటిస్తోందని ఆరోగ్య మంత్రి చెప్పారు.