Karnataka News: కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న అటు ఢిల్లీ నుంచి ఇటు బెంగళూరు వరకు గట్టిగా వినిపిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి రేసులో నలుగురు పోటీలో ఉన్నారు. అయినా ప్రధాన పోటీ డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్యే ఉంది. 


ముఖ్యమంత్రి సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం చెబుతోంది. పంచాయితీ త్వరగా తేలేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రిని ఎన్నుకునే హక్కును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో మూడు ఫార్ములాలపై చర్చ జోరందుకుంది.


మూడు ఫార్ములాల్లో రెండు డీకే శివకుమార్‌కు అనుకూలంగా ఉండగా, ఒక ఫార్ములా సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఢిల్లీలో ఖర్గేతో చర్చల అనంతరం పరిశీలకులు మళ్లీ బెంగళూరు వెళ్లనున్నారు.


కాంగ్రెస్‌లో 3 ఫార్ములాలపై చర్చ 
1. శాసనసభాపక్ష నేతగా పీసీసీ అధ్యక్షుడినే ఎన్నుకోవడం - ఈ ఫార్ములాపై కాంగ్రెస్‌లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. 2015 తర్వాత 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. వీటిలో పంజాబ్ (2017), మధ్యప్రదేశ్ (2018), చత్తీస్‌గఢ్ (2018), రాజస్థాన్ (2018), హిమాచల్ (2022) ఉన్నాయి.
ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుడిని శాసనసభా పక్ష నేతగా అంటే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్‌ను కాంగ్రెస్ తరఫున శాసనసభా పక్ష నేతగా చేశారు. థోరట్ తర్వాత ఉద్ధవ్ కేబినెట్‌లో చేరారు.


2014కు ముందు కూడా శాసనసభాపక్ష నేతగా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే సంప్రదాయం కాంగ్రెస్‌లో ఉండేది. 2013లో గెలిచిన తర్వాత అప్పటి ప్రెసిడెంట్‌గా ఉన్న సిద్ధరామయ్యను కర్ణాటకలో సీఎంగా చేశారు. 2012లో హిమాచల్‌లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వీరభద్రసింగ్ ముఖ్యమంత్రి అయ్యారు.


ఈ ఫార్ములా అమలుపై కాంగ్రెస్‌లో సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే జరిగితే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. ఈ ఫార్ములాను అమలు చేయడం సిద్ధరామయ్యకు పెద్ద ఎదురుదెబ్బే.


2. హిమాచల్ ప్రదేశ్‌ సుఖు, పంజాబ్‌లో చన్నీ ఫార్ములా - 2021లో కెప్టెన్ అమరీందర్ సింగ్ హైకమాండ్‌పై కోపంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడంతో పలువురి పేర్లపై చర్చ జరిగింది. వీరిలో సిద్ధూ, సునీల్ జాఖర్ పేర్లు ప్రముఖంగా వినిపించినా చివరకు చరణ్ జిత్ సింగ్ చన్నీ పేరు ఆమోదం పొందింది.


హిమాచల్ ప్రదేశ్ లో కూడా 2022లో విజయం సాధించిన తర్వాత ప్రతిభా సింగ్, ముఖేష్ అగ్నిహోత్రి, సుఖ్వీందర్ సింగ్ సుఖు పేర్లను చర్చించినప్పటికీ చివరకు సుఖు పేరును అధిష్టానం ఆమోదించింది.


ఈ రెండు ఎంపికల వెనుక రాహుల్ గాంధీ హస్తం ఉందని కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కావడానికి రాహుల్ ఎంపిక కూడా ఒక ఫార్ములా. కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి ఎంపికలో రాహుల్ ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు.


ఇప్పటి వరకు గాంధీ కుటుంబం బహిరంగంగా ఎవరికీ మద్దతుగా నిలవకపోయినప్పటికీ ఇక్కడ కూడా డీకే శివకుమార్ వైపు మొగ్గు ఉందని భావిస్తున్నారు. పరిశీలకుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబాన్ని సంప్రదించిన తర్వాత నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. 


3. పవర్ షేరింగ్ సర్దుబాటు ఫార్ములా: రాజస్థాన్ తరహాలోనే కర్ణాటకలో కూడా అధికార పంపకాల సర్దుబాటు ఫార్ములాను అమలు చేయాలనే మరో ప్లాన్ నడుస్తోంది. సిద్ధరామయ్య, శివకుమార్‌కు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నందున కర్ణాటకలో రిస్క్ తీసుకోవడానికి ఆ పార్టీ ఇష్టపడటం లేదు.


సిద్దరామయ్య, శివకుమార్ ఇద్దరూ తమకు అనుకూలంగా 65 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటున్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ ఎవరివైపు ఒకరివైపు మొగ్గు చూపి రిస్క్ తీసుకోదు. ఈ సందర్భంలో సర్దుబాటు సూత్రాన్ని వర్తింపజేయవచ్చు.


రాజస్థాన్ తరహాలో ఇక్కడ కూడా ముఖ్యమంత్రి, ఒక ఉపముఖ్యమంత్రి పగ్గాలు దక్కవచ్చు. ఈ ఫార్ములా అమలైతే సిద్ధరామయ్యకు సీఎం పీఠం దక్కే అవకాశం ఉంది. అయితే సిద్ధరామయ్య కేవలం రెండేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 


ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకోవడానికి సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాను కాంగ్రెస్ బెంగళూరుకు పంపింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇన్చార్జి రణదీప్ సూర్జేవాలాతో కలిసి ముగ్గురు నేతలు ఒక్కొక్క ఎమ్మెల్యే అభిప్రాయాన్ని తీసుకున్నారు. దీని ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.


బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లి ఖర్గేకు పూర్తి నివేదిక సమర్పిస్తామని జితేంద్ర సింగ్ విలేకరులకు తెలిపారు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయనున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల స్లిప్లను ఖర్గే ముందు తెరవనున్నారు. 


పరిశీలకుల నివేదిక అందిన తర్వాత ఖర్గే సుర్జేవాలా, వేణుగోపాల్‌తో సంప్రదింపులు జరుపుతారు. సిద్ధరామయ్య, శివకుమార్‌తో కూడా చర్చలు జరపనున్నారు. ఇరువురు నేతలను కూడా ఢిల్లీకి పిలిపించి మాట్లాడవచ్చు. 


సీఎం కోసం సిద్ధరామయ్య, శివకుమార్ శిబిరం వాదన ఏమిటి?


హైదరాబాద్-కర్ణాటక, కళ్యాణ కర్ణాటక ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్నారు. 2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని నడపడంతో ఆయన పథకాలకు విశేష ప్రజాదరణ లభించింది.


సిద్ధరామయ్య వయసు దృష్ట్యా కనీసం రెండేళ్ల పాటు ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. సిద్ధరామయ్య కూడా ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడం తప్ప కాంగ్రెస్ కు మరో ఛాన్స్ లేదంటున్నారు. లింగాయత్, ముస్లిం, ఓబీసీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధరామయ్యకు మద్దతిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సిద్ధరామయ్య పార్టీలు మారిన నేపథ్యం ఉండటం ఆయనకు మైనస్ కానుంది. 
ఫలితాల అనంతరం శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ కోసం చేసిన త్యాగాలు గుర్తు చేశారు. 2013లో అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్యను వ్యతిరేకించకుండా మంత్రివర్గంలో చేరారని శివకుమార్ మద్దతుదారులు చెబుతున్నారు. పార్టీ కోసం చేసిన పనులతో సీబీఐ దృష్టిలో పడ్డారని 2019లో జైల్లో ఉండాల్సి వచ్చిందంటున్నారు ఆయన మద్దతుదారులు. 


శివకుమార్ మద్దతుదారులు కూడా సిద్ధరామయ్య పనితీరును ఉదహరిస్తున్నారు. 2014, 2018, 2019 ఎన్నికల్లో సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.