Jammu And Kashmir Assembly Election Results 2024 : వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్న సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో, ఇవాళ జమ్మూకశ్మీర్ ఎలక్షన్స్‌ ఫలితాలు చూస్తే ఇదే స్పష్టం అవుతుంది. 500 ఏళ్ల హిందువుల కల అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టినా, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా బీజేపీకి చేదు ఫలితం ఎదురైంది.


మొన్న రామ మందిరం షాక్


రామ మందిరాన్ని కట్టించి హిందువుల చిరకాల కోరికను నిజం చేసి చూపించారు ప్రధాని మోదీ. అవాంతరాలు, అడ్డంకులు..కోర్టు కేసులు..వివాదాలు అన్నీ ఒక్కొటిగా దాటుకుని భవ్యరామ మందిరం నిర్మాణం పూర్తి చేశారు. రాముడి ప్రతిష్ఠ జరిపారు. దేశమంతా హ్యాపీ అనుకున్నారు. ఇది చూసిన హిందువులు, బీజేపీ ఇంకా హ్యాపీ. రాముడికి ఇన్నాళ్లకు ఓ నీడ దొరికిందని సంతోష పడ్డారు. రామ మందిరం నిర్మాణం పూర్తి చేశామన్న ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికలకు దిగిన బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అయోధ్య అసెంబ్లీ ఉన్న ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గాన్ని ఇండీ కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. అంటే ఇన్నేళ్ల కలను తీర్చిన అయోధ్య ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్లు బీజేపీని తిరస్కరించారని అర్థం. ఇది ఊహించని షాక్ బీజేపికి అని చెప్పవచ్చు.


నేడు జమ్మూలో షాక్


తాజాగా రెండో షాక్ తగిలింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ను పూర్తిగా భారత్ చట్టాల పరిధిలోకి తీసుకువచ్చింది బీజేపీ ప్రభుత్వం. దీని కోసం ఎన్నో ఏళ్లుగా వ్యూహం పన్నింది. అస్సలు బీజేపీ ఐడియాలజీకి సరిపోని మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకుని గెలిచింది. తర్వాత మద్దతు ఉపసంహరించుకుని మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. రాజకీయ వ్యూహాలతో కశ్మీర్ లోని పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసి వేర్పాటువాద శక్తులు సైతం బిత్తరపోయేలా ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఫలితంగా కశ్మీర్ రాష్ట్రం హోదా కోల్పోయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్ము కశ్మీర్ , లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త ప్రయాణం మొదలు పెట్టాయి.  తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జనరల్ గా పాకిస్థాన్ కబంధ హస్తాల్లోనూ..వేర్పాటు వాద శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్న కశ్మీర్ ను పూర్తిగా మన చేతుల్లోకి తెచ్చుకునేలా..పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మాదే అని పార్లమెంటులో గర్జించిన అమిత్ షా కామెంట్స్ కు దేశభక్తి తో ఉప్పొంగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలి కదా. అందుకే ఈసారి పీడీపీతో కూడా పనిలేకుండా సింగిల్‌గా బరిలోకి దిగింది. కానీ ఈరోజు వచ్చిన రిజల్ట్ బీజేపీకి షాక్ ఇచ్చింది. అబ్దుల్లాల పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ తో జత కట్టిన కాంగ్రెస్ కశ్మీర్ లో హవా చూపించింది. 


రాహుల్ గాంధీ అప్పర్ హ్యాండ్


ఈక్వేషన్ సింపుల్. ఫైట్ ఏదైనా కానీ ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేదే చూస్తారు. మన దేశంలో జాతీయ స్థాయిలో రెండే ప్రధాన అధికార కేంద్రాలు. ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్. పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న మోదీ గద్దె దింపాలని ఈ కాంగ్రెస్ దేశంలోనే చాలా విపక్షాలు ఏకం చేసి ఇండీ కూటమిగా ఏర్పడ్డాయి. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ నడిచారు. శ్రీనగర్ లో మంచులో తడుస్తూ యాత్రను ముగించే ప్రసంగం చేశారు కూడా. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఊహించనంత పోటీ ఇచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి. సొంతంగా 99 ఎంపీ స్థానాలు గెలుచుకుని బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించటమే కాదు..పార్లమెంటులో బీజేపీ ఆటలు సాగే అవకాశం లేనంత పెద్దశక్తిగా నిలబడింది. 


కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే..బీజేపీ అనే పార్టీ ఏర్పాటుకు కొన్ని సిద్ధాంతాలు చాలా మూలం. వాటి సాధన కోసమే భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఇద్దరు ఎంపీలతో ప్రస్థానాన్ని ప్రారంభించి దేశంలో ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అలాంటి కీలక సిద్ధాంతాల్లో రెండైన అయోధ్య రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 లాంటి వి రద్దు చేసినా..ప్రధానంగా ఆ ప్రభావం కనిపించాల్సిన రెండు ప్రాంతాల్లోనూ బీజేపీ ఓటమి అనేది రాహుల్ గాంధీ విజయంగా..తనను తగ్గించుకునైనా సరే అక్కడ ఎవరిని పెట్టాలో వాళ్లని పెట్టి..ఎవరితో చేతులు కలపాలో వాళ్లతో చేతులు కలిపి మోదీ, అమిత్ షా లాంటి వాళ్లకే షాక్ ఇచ్చిన రాజకీయ వ్యూహంగా చూడాలా. లేదా రెండు ఏదో కాకతాళీయంగా ఓడిపోయింది బ్యాడ్ లక్ అనుకోవాలా..


Also Read: పడిలేచిన కెరటంలా బీజేపీ- హర్యానాలో హ్యాట్రిక్‌ దిశగా కమలం - అనూహ్యంగా పడిపోయిన కాంగ్రెస్‌!