Chandrayaan 3 Launched: 


మూన్ రేస్‌లో ఇండియా..


2019 సెప్టెంబర్ 6వ తేదీ. దేశమంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూసింది. చరిత్ర సృష్టించడానికి మరి కొద్ది క్షణాలే మిగిలున్నాయి. చంద్రుడిపై చంద్రయాన్ 2 ల్యాండ్ (Chandrayaan 2) అవుతుంది అనుకునే సమయంలోనే అనుకోని అవాంతరం ఎదురైంది. చంద్రయాన్ 2 క్రాష్ అవడం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ఇస్రో సైంటిస్ట్‌లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వాళ్లను ఓదార్చారు. ఆ ఫెయిల్యూర్‌తో ఆగిపోలేదు ఇస్రో శాస్త్రవేత్తలు. "కచ్చితంగా మూన్ మిషన్‌ని సక్సెస్ చేయాల్సిందే" అని పట్టుపట్టారు. దాదాపు నాలుగేళ్లు శ్రమించి చంద్రయాన్ 3 మిషన్‌ని విజయవంతంగా లాంఛ్ చేశారు. చంద్రయాన్ 2 లో సాధ్యం కాని సాఫ్ట్‌ ల్యాండింగ్‌ని చంద్రయాన్ 3తో సాధిస్తామని చాలా ధీమాతో ఉంది ఇస్రో. చంద్రుడిపై ఉపరితలంపై పరిశోధనలు చేసేందుకు ఈ మిషన్‌ చేపట్టింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌ ఉంటాయి. ఇవే చంద్రుడిపై ఉన్న కీలక సమాచారాన్నంతా భూమికి చేరవేస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కి అయిన ఖర్చు రూ.615 కోట్లు. ఇండియా మాత్రమే కాదు. ఈ మూన్ రేస్‌ (Moon Race)లో ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. ఆ దేశాలు ఇప్పటికే సాఫ్ట్‌ ల్యాండింగ్‌తో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మిగిలింది ఇండియా వంతు. చంద్రయాన్ 3 విజయం సాధిస్తే..అమెరికా, రష్యా, చైనాతో పాటు భారత్‌ కూడా చరిత్ర సృష్టిస్తుంది. చంద్రయాన్ 2ని తయారు చేసిన ప్లాట్‌ఫామ్‌పైనే చంద్రయాన్‌ 3ని తయారు చేశారు. ఈ మిషన్‌తో చాలా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని చంద్రుడిపైకి మోసుకెళ్లనున్నారు. 


చంద్రయాన్‌ 2 నుంచి పాఠాలు..


చంద్రయాన్ 2 మిషన్‌ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఇస్రో స్పష్టం చేసింది. గతంలో జరిగిన తప్పులు రిపీట్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించింది. ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం చంద్రయాన్ 3కి ఉందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్ గ్లిచ్‌లు తలెత్తకుండా చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. అదనంగా కెమెరాలు అమర్చారు. సాఫ్ట్‌వేర్‌నీ ఇంప్రూవ్ చేశారు. ఏదైనా ముప్పు తలెత్తే ముందే డిటెక్ట్ చేసేలా టెక్నికల్ అప్‌డేషన్ చేశారు. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను స్వాగతిస్తోంది భారత్. చంద్రయాన్ 3 సక్సెస్ అయితే ఆ పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశాలున్నాయి. 2020లో ఇండియన్ స్పేస్ ఎకానమీ విలువ 9.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 2025 నాటికి ఇది 13 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా స్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి 140 కంపెనీలున్నాయి. మూన్‌ రేస్‌లో దూసుకుపోతున్న ఇండియా అమెరికాకి చెందిన మూన్ మిషన్ Artemisతో ఒప్పందం కుదుర్చుకుంది. అవసరమైతే విదేశాల సహకారమూ తీసుకుంటామన్న సంకేతాలిచ్చింది. స్పేస్‌పై పట్టు సాధించాలన్న భారీ లక్ష్యంతో ఉన్నాయి అమెరికా, చైనా. మూన్ మిషన్ కోసం చైనా, రష్యా చేతులు కలిపాయి. కానీ...ఇండియా మాత్రం సొంతగా ఈ మిషన్‌ని చేపట్టడం సాహసమే. చంద్రయాన్ 3 ఎప్పుడో పూర్తికావాల్సి ఉన్నా కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. అయినా..చంద్రయాన్ 2 నుంచి నేర్చుకున్న పాఠాలతో చంద్రయాన్ 3ని పకడ్బందీగా డిజైన్ చేసినట్టు ఇస్రో వెల్లడించింది. 


Also Read: Chandrayaan 3 Launched: చంద్రయాన్ 3ని విజయవంతంగా లాంఛ్ చేసిన ఇస్రో, ప్రముఖుల ప్రశంసలు