BSNL Latest News: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL లాభాల బాట పట్టింది. పదిహేడేళ్ల తర్వాత తొలిసారిగా లాభాలు కళ్లారా చూసింది. డిసెంబర్ త్రైమాసికంలో రూ.262 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత 17 సంవత్సరాలలో కంపెనీ ఏ త్రైమాసికంలో కూడా లాభాలు చూడలేదు. తొలిసారి ఇప్పుడే లాభాలు చూస్తోంది. ఇది కంపెనీకి ఒక ముఖ్యమైన మలుపుగా కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభివర్ణించారు. సేవల విస్తరణ, ఖర్చు తగ్గింపు, వినియోగదారులను ఆకట్టుకోవడంలో విజయం సాధించడంతోనే ఆ లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. "ఈ రోజు బిఎస్ఎన్ఎల్కు, భారతదేశంలో టెలికాం రంగానికి ఒక ముఖ్యమైన రోజు... బిఎస్ఎన్ఎల్ 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో, 17 సంవత్సరాలలో మొదటిసారిగా, త్రైమాసిక ప్రాతిపదికన లాభాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 2007 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ త్రైమాసిక లాభాన్ని నమోదు చేసింది" అని సింధియా పోస్టు పెట్టారు.
14-18 శాతం పెరుగుదలదేశంలోని ఏకైక ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన ఈ టెలికాం కంపెనీ గతే ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మొబిలిటీ, ఫైబర్-టు-ది-హోమ్ (FTTH), లీజుకు ఇచ్చిన లైన్ సేవల నుంచి లాభాల్లో 14-18 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది జూన్లో కంపెనీ మొత్తం 8.4 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. డిసెంబర్లో ఇది 9 కోట్లకు పెరిగింది.
Also Read: ELI స్కీమ్ కోసం UAN యాక్టివేట్ చేయడానికి ఇదే చివరి తేదీ - మిస్ చేస్తే రూ.15,000 పోతాయ్!
కంపెనీ తన ఖర్చులను కూడా బాగా తగ్గించుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరం కంపెనీ తన ఖర్చులను రూ.1,800 కోట్లు తగ్గించుకుంది. ఈ కారణాలన్నింటి వల్ల 2007 తర్వాత కంపెనీ లాభం ఆర్జించగలిగింది. "నాల్గో త్రైమాసికం చివరిలో ఆదాయాల్లో పెరుగుదల మాత్రమే కాకుండా, ఖర్చులను నియంత్రించడం, గత సంవత్సరం లెక్కలతో పోలిస్తే నష్టాలను గణనీయంగా తగ్గుతుందని ఆశిస్తున్నాము" అని మంత్రి అన్నారు.
బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు నేషనల్ వైఫై రోమింగ్, మొబైల్ వినియోగదారులకు ఉచిత BiTV, FTTH వినియోగదారులకు IFTV, మైనింగ్ కోసం దేశంలో మొట్టమొదటి 5G కనెక్టివిటీ సేవలను అందిస్తోంది. దీనితో పాటు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. దీని కోసం 1 లక్ష టవర్లలో 75,000 టవర్లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి అన్ని టవర్లను వర్కింగ్ మోడ్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు సింధియా తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం ఆ కంపెనీకి 4G సేవలను అందించడానికి 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. దీనివల్ల పనులు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు. "ఈ త్రైమాసికంలో లాభాలు రావడం BSNLకి ఒక మలుపు, ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా చందాదారులకు 4G సేవలు అందించడం ప్రారంభించాం. 100,000 టవర్లలో దాదాపు 75,000 ఇన్స్టాల్ చేశాం. దాదాపు 60,000 ప్రారంభించాం. ఈ సంవత్సరం జూన్ నాటికి మొత్తం 100,000 టవర్లు పని చేస్తాయని ఆశిస్తున్నాము" అని సింధియా చెప్పారు.
Also Read: 'నేను SBI నుంచి మాట్లాడుతున్నా' - క్రెడిట్ కార్డ్ మోసాల్లో కొత్త పద్ధతి, జాగ్రత్త సుమా!