Trending
AIADMK General Council: OPSకు పళనిస్వామి ఝలక్- పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం
AIADMK General Council: సీనియర్ నేత పన్నీర్సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అన్నాడీఎంకే సంచలన నిర్ణయం తీసుకుంది.
AIADMK General Council: అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం (ఏడీఎంకే) పార్టీ నుంచి సీనియర్ నేత పన్నీర్సెల్వంను బహిష్కరిస్తూ జనరల్ కౌన్సిల్ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పన్నీర్సెల్వం ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడం సహా కోశాధికారి పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఆయన అనుచరులను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అన్నాడీఎంకే స్పష్టం చేసింది.
కీలక తీర్మానాలు
ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరిస్తూ పార్టీ సర్వసభ్య మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నెలల తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాలని పళనిస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉన్నవారు ఓటేసి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. అలానే పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిని.. జనరల్ సెక్రటరీ ఎన్నుకునేలా మరో తీర్మానానికి ఆమోదం తెలిపారు. అప్పటివరకు పళనిస్వామి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
ఇక ఏక నాయకత్వం
జయలలిత మృతి తర్వాత పార్టీలో కొనసాగుతున్న ద్వంద్వ నాయకత్వ విధానాన్ని ఈ సమావేశంలో రద్దు చేశారు. పార్టీ కోఆర్డినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేశారు. దీంతో పార్టీ నాయకత్వ పగ్గాలు ఎవరైనా ఒక్కరే చేపట్టే అవకాశం ఉంటుంది. గతంలో పళనిస్వామి, పన్నీర్సెల్వం పార్టీ పగ్గాలు పంచుకున్నారు. ఇక తాజాగా ఈ సంప్రదాయానికి తెరపడింది.
ఇరు వర్గాల ఘర్షణ
మరోవైపు పన్నీర్సెల్వంను బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో అన్నాడీఎంకే కార్యాలయం బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పన్నీర్సెల్వం, పళనిస్వామి వర్గాలకు చెందిన కార్యకర్తలు గొడవపడ్డారు. ఓపీఎస్కు చెందిన వర్గం.. పళనిస్వామి ఫొటోను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది కుర్చీలు విరగొట్టారు.
Also Read: Contempt Case: విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు షాక్- 4 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు ఫైన్!