ఆల్ ఇండియా అన్నా డ్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) చెన్నైలో నేడు (జూన్ 11) నిర్వహించతలపెట్టిన జనరల్ కౌన్సిల్ సమావేశానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పార్టీలో కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్ పదవులను రద్దు చేసి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు సోమవారం చెన్నైలో ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఎడప్పాడి పళనిస్వామి వర్గం ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశాన్ని నిర్వహించవద్దంటూ ఓ ఓ పన్నీర్ సెల్వం వర్గం హైకోర్టును ఆశ్రయించింది. 


ఓ పన్నీర్ సెల్వమ్, పార్టీ జనరల్ కౌన్సిల్ మెంబర్ పి.వైరముత్తు అలియాస్ అమ్మన్ వైరముత్తు, జస్టిస్ క్రిష్ణన్ రామసామి తదితరులు జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించవద్దంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాను పార్టీకి కో ఆర్డినేటర్ గా కొనసాగుతున్నానని, 2021 డిసెంబరు 6 న తాను ఏకపక్షంగా ఎన్నికయ్యానని, ఐదేళ్ల తర్వాతే తన పదవీకాలం ముగుస్తుందని పన్నీర్‌సెల్వం తన సివిల్ పిటిషన్ తో పాటు దరఖాస్తును దాఖలు చేశారు. జాయింట్ కోఆర్డినేటర్ ఎడప్పాడి కె పళనిస్వామితో పాటు ఆ సమయంలో ఓ పన్నీర్ సెల్వం ఈ పదవిని చేపట్టారు. కాగా, నేడు ఉదయం 9 గంటలకు న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను తోసిపుచ్చారు.


తారస్థాయికి అంతర్గత పోరు
పార్టీలో ఇద్దరి లీడర్‌షిప్‌కు వ్యతిరేకంగా ఒకే సమైక్య నాయకత్వం ఉండాలని ఎడప్పాడి పళని స్వామి, ఓ పన్నీర్ సెల్వం వర్గాల మధ్య అసమ్మతి తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో అన్నాడీఎంకేలో తీవ్ర అంతర్గత పోరుకు దారి తీసింది. ఫలితంగా, జూన్ 23న జరగాల్సిన జనరల్ కౌన్సిల్ సమావేశం ఆ రోజు ఉదయం 4:40 గంటలకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు కారణంగా జరగలేదు. ఆ ఉత్తర్వును తర్వాత సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో ఓ పన్నీర్‌సెల్వం వర్గం ప్రత్యేకంగా జూలై 11న నిర్వహించే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఆపాలని తాజా సివిల్స్ పిటిషన్ ను ఏర్పాటు చేశారు.