IRCTC Scam: నకిలీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లు, యాప్ లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఈమధ్యకాలంలో పెరిగిపోయాయి. రైలు ప్రయాణాల కోసం వాడే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ను పోలిన వెబ్‌సైట్‌ను, యాప్‌ను పోలిన నకిలీ యాప్‌లను సృష్టిస్తూ వాటితో మోసాలకు పాల్పడుతున్నారు. చాలా మంది నకిలీలనే అసలైనవిగా నమ్మి మోసపోతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు. 


కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ వండిపేటకు చెందిన ఎం.మహమ్మద్ బషీర్ అనే 78 ఏళ్ల వ్యక్తి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఉపయోగించి రైలు టికెట్ ను క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే రూ. 4 లక్షలు పోగొట్టుకున్నాడు. బషీర్ అచ్చంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను పోలి ఉన్న నకిలీ వెబ్‌సైట్‌లోకి వెళ్లాడు. తను బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో రైల్వే ఉద్యోగి అని చెప్పుకునే మోసగాడి నుంచి బషీర్ కు ఫోన్ కాల్ వచ్చింది. తాను రైల్వే ఉద్యోగి అని.. తాను చెప్పినట్లు చేస్తే టికెట్లు క్యాన్సిల్ అయిపోయి.. రీఫండ్ వస్తుందని చెప్పుకొచ్చాడు. మోసగాడు చెప్పినది నమ్మిన బషీర్.. తాను ఏది చెబితే అది చేయడం మొదలుపెట్టాడు. నకిలీ వెబ్‌సైట్‌లో అలా చేయడం వల్ల తన స్క్రీన్ పై బ్లూ ఎంబ్లెమ్ కనిపించింది. అలా బషీర్ డివైజ్ ను ఆ సైబర్ నేరగాడు హ్యాక్ చేసి తన నియంత్రణలోకి తీసుకున్నాడు. అలాగే బషీర్ తన బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ నంబరు అన్నీ చెప్పేయడంతో సైబర్ నేరగాడికి పని మరింత సులువు అయిపోయింది. 


Also Read: PM Modi: బెంగాల్ పంచాయతీ ఎన్నికలపై మోదీ మండిపాటు, రక్తంతో ఆడుకున్నారంటూ మమత సర్కారుపై ధ్వజం


బాధితుల డివైజ్ లను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్లను ఇన్‌స్టాల్ చేస్తారు. రిమోట్ యాక్సెస్ ట్రోజన్లు (RAT)తో బాధితుల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లను తమ నియంత్రణలోకి తీసుకుంటారు. అలా ఆ ఫోన్ ద్వారా వాళ్లు ఏదైనా చేయవచ్చు. అలాగే బాధితులు ఏం చేసినా తెలుసుకోవచ్చు. కీలాగర్లు కూడా ఇన్‌స్టాల్‌ చేయడం వల్ల కీస్ట్రోక్ ను రికార్డు చేసి పాస్‌వర్డ్‌లు కూడా తెలుసుకుంటారు. అలాంటి పలు చర్యలతో బాధితులను మోసగిస్తారు. బషీర్ డివైజ్ ను తన నియంత్రణలోకి తీసుకున్న సైబర్ నేరగాడు.. బషీర్ కు చెందిన సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బు తీశాడు. ఆ మెసేజ్ బషీర్ మొబైల్ కు రావడంతో తను మోసపోయినట్లు గుర్తించాడు బషీర్. వెంటనే తన బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించాడు. కానీ అప్పటికే తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ లోని రూ.4 లక్షలు కూడా డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. 


సైబర్ నేరగాళ్లు మూడు వేర్వేరు నంబర్ల నుంచి బషీర్ కు ఫోన్ చేశారు. మొదటిసారి బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసినట్లు మెసేజ్ రాగానే.. వేరొకరు ఫోన్ చేసి బషీర్ బ్యాంకుకు ఫిర్యాదు చేయకుండా ఆపారు. అలా మూడు సార్లు చేసి చివరికి రూ. 4 లక్షలకుపైగా పోగొట్టుకున్నాడు. రెస్ట్ డెస్క్ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసి బషీర్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కోల్‌కతా, బెంగాల్, బీహార్ కు చెందిన వ్యక్తులకు చెందిన ఫోన్ నంబర్ల నుంచి బషీర్ కు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.