Hyderabad Airport News: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న డైమండ్స్ ను భారీగా పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి రూ.6 కోట్ల విలువైన డైమండ్స్ స్వాధీనం చేసుకున్నారు. అత్యంత విలువైన ఈ డైమండ్స్‌ను చాక్లెట్ వెపర్స్‌లో పెట్టి ప్రయాణికుడు తీసుకొచ్చినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.


డీఆర్‌ఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్‌ వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని సామగ్రిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. చాక్లెట్‌ కవర్లలో ప్రత్యేకంగా ప్యాక్‌ చేసిన రూ.6 కోట్ల విలువైన డైమండ్స్‌, రూ.9.83 లక్షల విదేశీ కరెన్సీ, రూ.లక్ష నగదు గుర్తించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.