Hyderabad Metro Extends Rail Timings on December 31st: న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) సందర్భంగా హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కీలక నిర్ణయం తీసుకుంది. నగర వాసులకు ఊరట కలిగించేలా డిసెంబర్ 31న ఆదివారం అర్ధరాత్రి 12:15 గంటల వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. చివరి మెట్రో రైలు 12:15 గంటలకు బయలుదేరి ఒంటిగంటకు గమ్యస్థానాలకు చేరుతాయని వెల్లడించారు. ఇదే సమయంలో భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


పోలీసుల కఠిన ఆంక్షలు


మరోవైపు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మద్యం తాగి వాహన నడిపి పట్టుబడిన వారికి రూ.15 వేల జరిమానాతో పాటు రెండేళ్ల వరకూ జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. మొదటిసారి దొరికిన వాళ్లకు గరిష్టంగా రూ.10 వేల ఫైన్ తో పాటు 6 నెలల వరకూ జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. ఇక, రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా సహా రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని అన్నారు. డ్రైవింగ్ లైెసెన్స్ రద్దుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు. మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. పబ్బులు, న్యూ ఇయర్ వేడుకల ప్రదేశాలు, స్టార్ హోటళ్ల వద్ద పార్కింగ్ యాజమాన్యాలదే బాధ్యత అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని హోటళ్లు, పబ్బులు, ఈవెంట్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసులు చెప్పారు. ఈ వేడుకల్లో శాంతి భద్రత సమస్యలు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరిమితికి మించి పాసులు ఇవ్వొద్దని చెప్పారు.


అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి


డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉందని, ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన టైం వరకే లిక్కర్ అమ్మకాలు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు, అధిక శబ్దాలు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్స్ జరిగే ప్రదేశాలు మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, ఆ రోజు రాత్రి పూట ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని, అలా చేస్తే జరిమానా విధిస్తామని క్యాబ్ డ్రైవర్లను హెచ్చరించారు. అంతే కాదు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైడ్‌ నిరాకరించకూడదని స్పష్టం చేశారు. రూల్స్‌ మీరితే... మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన కింద రూ.500 జరిమానా విధిస్తామని తెలిపారు. ఎవరైనా క్యాబ్‌ డ్రైవర్‌, రైడ్‌ రద్దు చేస్తే 9490617346కు క్యాబ్‌ నెంబర్‌, సమయం, ప్రదేశం తదితర వివరాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు.


మరోవైపు, ఆ రోజున రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నగర పరిధిలోని ఫ్లై ఓవర్లతో పాటు పలు రహదారులు కూడా మూసివేయనున్నట్లు సైబరాాబాద్ పోలీసులు ప్రకటించారు. శిల్పా లేఅవుట్‌, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, షేక్‌పేట, మైండ్‌ స్పేస్‌, రోడ్‌ నం.45, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, సైబర్‌ టవర్స్‌, ఫోరం మాల్‌, జేఎన్‌టీయూ, ఖైత్లాపూర్‌, బాలానగర్‌ బాబుజగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్లు కూడా మూసేస్తారు. వీటితో పాటు ఓఆర్ఆర్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేలు కూడా మూసివేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు. 


Also Read: Kodangal Development : కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ దృష్టి - ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు