HP Election 2022: హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 413 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 92 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.


ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సొంత జిల్లా మండిలోని జోగిందర్ నగర్ స్థానంలో అత్యధికంగా 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.


కీలక తేదీలు



  • నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 25

  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29

  • పోలింగ్ తేదీ: నవంబర్ 12

  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు: డిసెంబర్ 8


ఆ మూడు పార్టీలు


మొత్తం 551 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత వారిలో 46 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు. 505 మంది పోటీకి అర్హత సాధించారు, అయితే 92 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మొత్తం అభ్యర్థుల సంఖ్య 413కి చేరుకుంది.


413 మంది అభ్యర్థుల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తలా 68 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ వారి పార్టీ అభ్యర్థులను నిలబెట్టాయి.


హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 12న జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది.


2017లో


2017లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను 44 చోట్ల భాజపా గెలిచింది. దీంతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ కేవలం 21 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని గెలుచుకోగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో జై రామ్ ఠాకూర్‌ను పార్టీ అధిష్ఠానం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించింది.


ABP- C ఓటర్ సర్వే


హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఇటీవల ABP News,C Voter ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ABP News- C Voter Opinion Poll 2022 ప్రకారం...2017తో పోల్చి చూస్తే హిమాచల్‌లో భాజపా ఓటు షేర్ కాస్త తగ్గనుంది. ఈ ఏడాది ఓటు షేర్ 45.2%గా ఉండగా 2017లో ఇది 48.8%గా నమోదైంది. ఇక మిగతా పార్టీల సంగతి చూస్తే కాంగ్రెస్‌ ఓటు శాతం 33.9%గా అంచనా వేసింది. గత ఎన్నికలతో పోల్చితే ఇది 8% తక్కువ. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఓట్ షేర్ 9.5%గా నమోదవుతుందని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం భాజపానే మరోసారి అధికారంలోకి రానుంది. కాషాయ పార్టీ 37-45 సీట్లు సాధిస్తుందని ABP-C Voter సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్‌కు 21-29 స్థానాలు వచ్చే అవకాశముంది. ఆప్‌ కేవలం ఒక్క సీట్‌కే పరిమితం కావచ్చని వెల్లడించింది.


Also Read: Liz Truss Phone Hacked: యూకే మాజీ ప్రధాని లిజ్ ట్రస్ ఫోన్ హ్యాక్- ఆ రహస్యాలు పుతిన్ చేతికి!