మెగాస్టార్ చిరంజీవి నుంచి సరైన మాస్ ఎంటర్టైనర్ సినిమా కోసం ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్ కు 'వాల్తేరు వీరయ్య' సినిమా టీజర్ మాస్ బిర్యానీలా కనిపించింది. వింటేజ్ చిరంజీవి ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మెగాస్టార్ నుంచి ఇలాంటి మాస్ కట్ ఔట్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలే అయింది. 'వాల్తేరు వీరయ్య' లో చిరంజీవి లుంగీ తో ఉన్న లుక్స్ అదిరిపోవడంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఈ సమయంలో మెగాస్టార్ 154 సినిమాకు ఓ కాలేజి స్టూడెంట్స్ వినూత్నంగా  శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


ఆరు వేలమంది విద్యార్థులతో...
చిరంజీవి 154వ సినిమా సవాల్తేరు వీరయ్య'కు శుభాకాంక్షలు చెబుతూ మూవీ యూనిట్‌కు మల్లారెడ్డి కాలేజి స్టూడెంట్స్ ఓ స్పెషల్ గిఫ్ట్ అందించారు. అది ఏంటంటే... కాలేజి స్టూడెంట్స్ అంతా కలిసి మానవ హారం రూపంలో కూర్చున్నారు. పైనుంచి చూస్తే... వాళ్ళు కూర్చునది 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి లుక్‌లా ఉందన్నమాట. డ్రోన్ సాయంతో ఆ లుక్‌ వీడియో తీసి... సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. చిరు 'వాల్తేరు వీరయ్య' లుక్‌ రీక్రియేట్‌ చేయడానికి 6 వేల మంది విద్యార్థులు ఆ మానవ హారంలో పాల్గొన్నారట. ఆ వీడియో ను డైరెక్టర్ బాబీ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 






రాజకీయాల నుంచి విరామం తీసుకున్న తర్వాత చిరంజీవి నిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. 'ఖైదీ నంబర్‌ 150'తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాని తర్వాత చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. కొన్ని రోజుల క్రితం టీజర్ విడుదల చేశారు. అది మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. 


Also Read : బాలకృష్ణ సినిమా కోసమూ వెయిట్ తగ్గా - ఫ్లాష్‌బ్యాక్‌లో, ప్రజెంట్‌లో...


ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి, రవితేజ మీద సాంగ్‌ షూటింగ్‌ చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్‌, దేవి శ్రీ కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. అలాగే, రవితేజ - దేవి శ్రీది కూడా! చిరు, రవితేజకు దేవి శ్రీ ఎలాంటి సాంగ్స్‌ అందిస్తున్నారో మరి! సినిమాలో రవితేజ, చిరంజీవి అన్నదమ్ములుగా కనిపించనున్నారట. వారిద్దరి మధ్య గొడవల నేపథ్యంలో సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ లో టాక్. 


'వాల్తేరు వీరయ్య' సినిమాలో చిరంజీవి డబుల్ రోల్‌లో కనిపించనున్నారట. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో చిరు జోడీగా సుమలత కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు కనిపించనున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.