హిజాబ్‌ను ధరించి విద్యాసంస్థలకు వెళ్లేలా అనుమతివ్వాలని దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రితురాజ్​ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు 2 గంటలకుపైగా విచారించింది. అనంతరం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.






మధ్యంతర తీర్పు


అయితే అంతకుముందు ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంధ్యతర ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాసంస్థల్లోకి అడుగుపెట్టినప్పుడు విద్యార్థులు ఎలాంటి మతపరమైన దుస్తులను ధరించరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హిజాబ్ లేదా కాషాయ కండువా ఇలా.. ఏదీ ధరించవద్దని పేర్కొంది. కోర్టులో ఈ వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్నంతవరకు ఇది పాటించాలని ఆదేశించింది.


అంతకుముందు  జస్టిస్ క్రృష్ణ దీక్షిత్ ఏకసభ్య ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. హిజాబ్ ధరించి కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. విస్తృత ధర్మాసనమే ఈ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 


హిజాబ్ వివాదం..

 

కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్‌ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. నెల రోజుల నుంచి ఉడుపి, చిక్‌మంగళూరులో వాతావరణం ఆందోళనగా ఉంది. హిజాబ్స్‌ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోవడంతో ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు.


మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్‌' నినాదాలతో ర్యాలీలు చేశారు.