Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు సంచలన తీర్పు

ABP Desam   |  Murali Krishna   |  12 Sep 2022 02:58 PM (IST)

Gyanvapi Masjid Verdict: దేశావ్యాప్తంగా చర్చనీయాంశమైన జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక ఆదేశాలిచ్చింది.

(Image Source: PTI)

Gyanvapi Masjid Verdict: ఉత్తర్‌ప్రదేశ్‌ జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్​పై సానుకూలంగా స్పందించింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. తదుపరి వాదనలు సెప్టెంబర్ 22న విననున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేసింది. 

ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. హిందువులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తదుపరి వాదనలు సెప్టెంబర్ 22న విననుంది.                                                            - విష్ణు శంకర్ జైన్, హిందూ పక్షం న్యాయవాది

కోలాహలం

తీర్పు అనంతరం కోర్టు బయట కోలాహలం నెలకొంది. హిందువులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాటలు పాడుతూ, డ్యాన్స్ చేశారు.

హిందూ జాతికి ఇది ఓ విజయం. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ జరగనుంది. జ్ఞానవాపి మందిరానికి ఇది మొదటి మెట్టు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాం.                          - సోహన్ లాల్ ఆర్య, పిటిషనర్

దేశం ఇప్పుడు ఆనందంగా ఉంది. నా హిందూ సోదరసోదరీమణులు ఈరోజు దీపాలు వెలిగించాలి.                                              - మంజు వ్యాస్, పిటిషనర్

భారీ భద్రత

అత్యంత సున్నితమైన కేసు కావడంతో వారణాసిలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం కావడంతో కాశీ విశ్వనాథ్‌ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు.  

ఇదీ కేసు

జ్ఞాన్​వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు. 

సర్వేలో

దీంతో జ్ఞాన్​వాపి మసీదు- శృంగార్‌ గౌరీ ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్‌ కమిషనర్ కోర్టులో సమర్పించారు. అయితే అది శివలింగం కాదంటూ మసీద్‌ కమిటీ వాదిస్తోంది.  

సుప్రీం కోర్టుకు

ఈ వ్యవహారం తర్వాత సుప్రీం కోర్టుకు చేరింది. అయితే జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్‌ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది.

అలానే మసీదులో సీల్ వేసిన ప్రాంతాన్ని అలానే ఉంచాలని ఆదేశించింది. ముస్లింలు యథావిధిగా మసీదు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీం పేర్కొంది. 

ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. 

Also Read: NIA Raids: దేశంలోని 60 ప్రాంతాల్లో NIA మెరుపు దాడులు- గ్యాంగ్‌స్టర్లే లక్ష్యంగా!

Also Read: Bengaluru: శభాష్ డాక్టర్ సాబ్! సర్జరీ చేయడానికి ఆసుపత్రికి 3 కిమీ పరుగు!

Published at: 12 Sep 2022 02:39 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.