Gujarat Elections 2022:


రేసాన్ బూత్‌లో..


ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ ( Heeraben Modi) ఓటు హక్కు వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లోని రేసాన్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఇటీవలే 100వ పుట్టిన రోజు జరుపుకున్న ఆమె...తన చిన్న కుమారుడు పంకజ్ మోడీ కలిసి రేసాన్ గ్రామంలో నివసిస్తున్నారు. పంకజ్ మోడీ సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వీల్‌చైర్‌పై పోలింగ్‌ బూత్‌కు వచ్చారు హీరాబెన్. ఈ రెండో విడత పోలింగ్ జరగక ముందు...ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 










రెండో విడత పోలింగ్..


182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీలో 89 స్థానాలకు డిసెంబర్ 1న తొలి విడత పోలింగ్ జరిగింది. మిగిలిన 93 స్థానాలకు నేడు పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో భాజపా, ఆప్‌ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల ఒకటిన 89 స్థానాలకు పోలింగ్‌ జరగగా.. 63.34 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల కంటే 3 శాతానికిపైగా ఓటింగ్‌ శాతం తగ్గింది. రెండో విడత పోలింగ్‌ జరుగనున్న 93 స్థానాలకుగాను అన్నిపార్టీల తరఫున 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో 2.54 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారికోసం 26,409 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.


కేజ్రీవాల్ కామెంట్స్..


కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ సారి కాస్త కొత్తదనమైన తీర్పునివ్వండి" అంటూ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ సారి ఎలాగైనా గుజరాత్‌లో తమ ఉనికిని బల పరుచుకోవాలని గట్టి సంకల్పంతో ఉంది ఆప్‌. బీజేపీ కంచుకోట అయిన ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కన్నా ముందే ప్రచారాన్ని మొదలు పెట్టింది. క్రమక్రమంగా జోరు పెంచింది. స్వయంగా కేజ్రీవాల్ రాష్ట్రానికి వచ్చి అన్ని ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. "రెండో విడత పోలింగ్‌లో 93 సీట్లకు గానూ ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. ఈ ఎన్నికలు గుజరాత్ ప్రజలకు కొత్త ఆశాకిరణం లాంటిది. దశాబ్దాల తరవాత దొరికిన అరుదైన అవకాశమిది. భవిష్యత్ గురించిఆలోచించండి. గుజరాత్ పురోగతికి తోడ్పడండి. ఈ సారి మునుపటి కన్నా కొత్తగా తీర్పునివ్వండి" అని ట్వీట్ చేశారు. 


Also Read: Volcano In Indonesia: బద్దలైన ఎత్తైన అగ్ని పర్వతం- ఇండోనేసియాలో డేంజర్ బెల్స్!