Google India Lays Off:


వందలాది మంది ఫైర్..


గూగుల్‌ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే లేఆఫ్‌లు మొదలు పెట్టిన సంస్థ...ఇప్పుడు మరోసారి అదే పని మొదలు పెట్టింది. ఇండియాలోని 453 మంది ఉద్యోగులను తొలగించింది. రకరకాల విభాగాల్లోని ఉద్యోగులను ఇంటికి పంపింది. రాత్రికి రాత్రే మెయిల్స్ పంపించి "టర్మినేట్" చేస్తున్నట్టు ప్రకటించింది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా స్వయంగా ఈ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపారు. ఒకేసారి 12 వేల మందిని తొలగించనున్నట్టు ఇటీవలే గూగుల్ ప్రకటించింది. అందులో భాగంగానే ఆ పని ప్రారంభించింది. కంపెనీ గ్రోత్ తగ్గిపోయినందున లేఆఫ్‌లు తప్పడం లేదని ఇప్పటికే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే..భవిష్యత్‌లో ఇంత కన్నా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అందుకే...వెనకా ముందు ఆలోచించకుండా లేఆఫ్‌లు కొనసాగిస్తున్నామని చెప్పారు. బడా కంపెనీలన్నీ ఇండియాలో మార్కెట్‌ పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అయితే..కొవిడ్ తరవాత ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. రెవెన్యూ పడిపోయింది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది. అందుకే ఖర్చులు తగ్గించుకునేందుకు పెద్ద సంస్థలన్నీ ఇలా ఉద్యోగులను తొలగిస్తూ పోతున్నాయి.


Financial Times రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా పలు టీమ్‌లకు అవసరమైన బడ్జెట్‌ను రిలీజ్ చేయలేదు. అంటే...ఇన్‌డైరెక్ట్‌గా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు సంకేతాలిచ్చింది. ఉద్యోగులను తొలగించిన తరవాతే బడ్డెట్‌లు విడుదల చేయాలని భావిస్తోంది యాజమాన్యం. ఇప్పటికే ఉద్యోగుల్లో లేఆఫ్‌ల భయం మొదలైంది. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో అని కంగారు పడిపోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనమైంది. ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 13%. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో మొత్తంగా కలిపి 11 వేల మందిని ఇంటికి పంపింది మెటా. 


బాంబు బెదిరింపులు..


పుణేలోని గూగుల్ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ఓ ఆగంతకుడు కాల్ చేసి బెదిరించాడు. గూగుల్ ఆఫీస్‌కు కాల్ చేసి బాంబ్ పెట్టాం అని హెచ్చరించాడు. వెంటనే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ముంబయి పోలీసులు, పుణె పోలీసులు దీనిపై విచారణ మొదలు పెట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...ఆ కాలర్ తన పేరు పనయం శివానంద్‌గా చెప్పాడు. అంతే కాదు. తాను హైదరాబాద్‌లో ఉంటాననీ అన్నాడని గూగుల్ యాజమాన్యం వివరించింది. ల్యాండ్‌లైన్‌కు కాల్ చేసి ఇలా బెదిరించినట్టు వెల్లడించింది. ఈ సమాచారాన్నంతా ముంబయి పోలీసులు పుణె పోలీసులకు అందించారు. అయితే...ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గాలించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వెంటనే ముంబయికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేశాడన్నది మాత్రం ఇంకా తేలలేదు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు తెలిపారు. 


Also Read: Twitter Offices India: ట్విటర్ ఆఫీస్‌లకు తాళం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన మస్క్