Twitter Offices India:


ఇండియాలో రెండు ఆఫీస్‌లు బంద్..


ఇండియాలోని ట్విటర్‌ ఆఫీస్‌లకు తాళం వేసేయమని ఆర్డర్‌ పాస్ చేశారు ఎలన్ మస్క్. భారత్‌లోని మూడు కార్యాలయాల్లో రెండింటిన మూసేశారు. ఇక్కడి ఉద్యోగులంతా ఇంటి నుంచి పని చేసుకోవచ్చు అని ప్రకటించారు. ఆఫీస్‌లు అంటే బోలెడంత ఖర్చు. మెయింటేనెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. అసలే రెవెన్యూ లేక ఇబ్బందులు పడుతున్న ట్విటర్‌కు...ఇది అదనపు భారంగా మారింది. అందుకే ఆఫీస్‌లు తీసేసి ఉద్యోగులకు WFH ఆప్షన్ ఇచ్చేశారు మస్క్‌. భారత్‌లో ట్విటర్‌కు 200 మంది ఉద్యోగులుండేవాళ్లు. వారిలో 90% మందిని ఇప్పటికే తొలగించారు. ఇక మిగిలింది తక్కువే. వాళ్ల కోసం అంత పెద్ద ఆఫీస్‌లు ఎందుకని భావించారు మస్క్. అందుకే న్యూఢిల్లీ, ముంబయిల్లోని ఆఫీస్‌లకు తాళం వేశారు. బెంగళూరులోని ఆఫీస్ మాత్రం తెరిచే ఉంచారు. నిజానికి ఇండియాలోనే కాదు. ప్రపంచంలో చాలా చోట్ల ట్విటర్ ఆఫీస్‌లను మూసేశారు. ఈ ఏడాది పూర్తయ్యేలోగా ట్విటర్‌కు ఆర్థిక కష్టాలు తీరిపోవాలని చాలా పట్టుదలతో ఉన్నారు ఎలన్ మస్క్. అయితే...మెటా సహా గూగుల్‌ లాంటి బడా కంపెనీలు వీలైనంత ఎక్కువగా ఇండియాలో మార్కెటింగ్ చేసుకోవాలని చూస్తుంటే...మస్క్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి మార్కెట్‌ కన్నా ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని భావిస్తున్నారు. ట్విటర్‌కు భారత్‌లో చాలా మంది యూజర్‌లు ఉన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులకూ ఇందులో అకౌంట్‌లు ఉన్నాయి. మస్క్ వచ్చిన తరవాత మార్పులు చేర్పులు చేయడం వాళ్లను కాస్త ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తోంది. 


బ్లూటిక్ ఇండియాలోనూ..


ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక  ఎలన్ మస్క్ రెవెన్యూ పెంచుకునే మార్గాలు వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే..బ్లూ టిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని ప్రకటించారు. అందుకు కొంత ధర కూడా నిర్ణయించారు. అంటే...ఇకపై ట్విటర్ యూజర్స్ ఎవరైనా బ్లూ టిక్ కావాలంటే కచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే. ఇప్పటికే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ట్విటర్..ఇప్పుడు ఇండియాలోనూ దీన్ని లాంఛ్ చేసింది. ఇండియా యూజర్స్ ట్విటర్ బ్లూ ఫీచర్‌ను వినియోగించుకోవాలనుకుంటే నెలకు రూ.650 చెల్లించాలి. ఇది వెబ్ యూజర్స్‌కి. అదే మొబైల్ యూజర్స్‌ అయితే..రూ.900 కట్టాలి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్‌లో ఈ సర్వీస్ మొదలైంది. అక్కడి వెబ్ యూజర్స్‌ నెలకు 8 డాలర్లు చెల్లిస్తేనే బ్లూ టిక్‌ ఉంటుంది. అదే ఏడాదికైతే 84 డాలర్లు చెల్లించాలి. అదే యాండ్రాయిడ్ యూజర్స్‌ అయితే ట్విటర్ బ్లూ టిక్‌ కోసం అదనంగా 3 డాలర్లు చెల్లించాలి. అయితే...ఇందులో నుంచి కొంత వాటా గూగుల్‌కు కమీషన్ కింద ఇచ్చేస్తుంది ట్విటర్. ఇండియాలో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ కోసం రూ. 6,800 కట్టాలని కంపెనీ వెల్లడించింది. త్వరలో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో గోల్డ్ టిక్‌ను మెయింటెయిన్ చేయడానికి కంపెనీల నుంచి నెలకు 1,000 డాలర్లు వసూలు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారాన్ని కంపెనీ సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ట్విట్టర్‌లో కంపెనీలకు గోల్డ్ టిక్ ఇస్తారని సంగతి ఇప్పటికే తెలిసిందే. ఉదాహరణకు మీకు ఏదైనా మీడియా ఛానెల్ లేదా ప్రైవేట్ కంపెనీ ఉంటే ట్విట్టర్ దానికి గోల్డ్ టిక్ అందిస్తారు.


Also Read: Youtube New CEO: యూట్యూబ్ కొత్త సీఈఓగా భారతీయ సంతతి వ్యక్తి- సూసన్ వొజిసికి స్థానంలో నీల్ మోహన్ నియామకం