BRS Latest News: బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసేందుకు నాలుగోరోజూ జన ప్రవాహం కొనసాగింది. గురువారం నాడు ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసం జన సందోహం తో నిండిపోయింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులు కేసీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ అభిమాన నేతను కలిసి కరచాలనం చేసి భుజం మీద చేతులు వేయించుకుని మరీ ఫోటోలు దిగారు. అభిమాన నేతతో సెల్ఫీలు తీసుకున్నారు.


తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు ప్రజలతో కేసీఆర్ మాట్లాడారు. ఓపికతో అందర్నీ పలకరించారు. తాము కేసీఆర్ ను ఇంకా సీఎం గానే భావిస్తున్నట్టు చెప్పారు. తమ మనసులో కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమనేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గానే ముద్ర ఉన్నట్టు కొంత మంది యువకులు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఓ అభిమాని తిరుమల తిరుపతి దేవస్థానం చిత్రపటాన్ని తన అభిమాన అధినేతకు బహూకరించారు.