తెలంగాణలో ఇప్పటి వరకూ గ్రీన్ చాలెంజ్‌కు మంచి పబ్లిసిటీ వచ్చింది. ఎంపీ సంతోష్‌రావు ఈ గ్రీన్‌ చాలెంజ్‌ను చాలా పరిష్టాత్మకంగా తీసుకుని అందరితో మొక్కలు నాటిస్తున్నారు. నిన్నటికి నిన్న అమీర్‌ఖాన్‌తోనూ ఆ చాలెంజ్‌లో భాగస్వామ్యం అయ్యేలా చేయగలిగారు. కానీ ఇప్పుడు గ్రీన్ చాలెంజ్ కన్నా  " వైట్ చాలెంజ్ " ఎక్కువ పాపులర్ అవుతోంది. దీన్ని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరారు. అసలేంటి ఈ వైట్ చాలెంజ్ అంటే డ్రగ్స్ వాడలేదని టెస్టులు చేయించుకుని నిరూపించుకోవడం. దీన్ని ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి విసిరారు. టెస్టులు చేయించుకుని మరికొంత మందికి అలాంటి సవాళ్లు విసురుదామని "చాలెంజ్" కాన్సెప్ట్ !.  కానీ ఇందులోనే అసలు రాజకీయం ఉంది.  


కేటీఆర్‌పై వరుసగా డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి !
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచారణ ప్రారంభించిన తర్వాత తెలంగాణలో డ్రగ్స్ కేసు రాజకీయ అంశంగా మారింది. తాను కోర్టుల్లో న్యాయపోరాటం చేయడం ద్వారా ఈడీ రంగంలోకి దిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నారు. తెలంగాణ వ్యసన పరుల రాజ్యంగా మారిందని ఆయన మండి పడుతున్నారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందని ..దానికి టీఆర్ఎస్ ముఖ్య నేతల అండ ఉందని ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి నేరుగా కేటీఆర్‌ను గురి పెట్టారు. ఈడీ విచారణ ప్రారంభించిన తర్వాత కేటీఆర్ రహస్యంగా గోవా వెళ్లి వచ్చాడని ఆరోపించారు. అంతే కాదు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు వివరాలను ఈడీకి ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తోందని  అంత రహస్యం ఏముందని ప్రశ్నిస్తున్నారు. నేరస్తుల్ని కాపాడటానికి కాకపోతే ఆ సమాచారం ఇవ్వబోమని ఎందుకు కోర్టులో అఫిడవిట్ సమర్పించారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలు కొనసాగిస్తూనే గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన దండో సభలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ వాడతారని ఆరోపించారు.


ఏ టెస్టుకైనా సిద్ధం కానీ షరతులు వర్తిస్తాయన్న కేటీఆర్ ! 
రేవంత్ రెడ్డి ఆరోపణలను కేటీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. తప్పుడు మాటలు మాట్లాడితే  రేవంత్ రెడ్డిపై దేశద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు. అదే సమయంలో తను డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి రెడీ అని ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీ టెస్టులు చేయించుకోవడానికి రెడీనా అని సవాల్ చేశారు. వెంటనే రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని అందుకుని వైట్ చాలెంజ్ విసిరారు. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుందామని సవాల్ చేశారు. ఈ చాలెంజ్‌లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా కలుపారు రేవంత్ రెడ్డి. ఆయన కాంగ్రెస్‌లో లేరు.  ఆయన కూడా రేవంత్ ఈ ఇష్యూలో తనను ఎందుకు ఇన్వాల్వ్ చేశారో తెలియదు కానీ.. తెలంగాణకు మాత్రం డ్రగ్స్ పెద్దముప్పులా మారాయని అందుకే చాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని ప్రకటించారు.



Also Read : గుజరాత్ లో రూ.9వేల కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఆ ముఠాకు విజయవాడతో సంబంధాలు


వైట్ చాలెంజ్ పేరుతో  వరుసగా సవాళ్లు చేస్తున్న రేవంత్ !
రేవంత్ రెడ్డి ప్రకటించిన దాని ప్రకారం సోమవారం కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు కేటీఆర్ వస్తే ముగ్గురూ కలిసి వెళ్లి డ్రగ్స్ వాడారో లేదో టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను రావడం లేదన్న సంకేతాలను ట్విట్టర్‌లో పంపారు. తాను ఢిల్లీ ఎయిమ్స్‌లో టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమని అలాగే రాహుల్ గాంధీ కూడా రావాలని సవాల్ చేశారు. అలాగే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని సవాల్ చేశారు.



Also Read : ఒక్క ముద్దుకు రూ.25 వేలు, ఆస్పత్రి రెంట్ కూడా.. ఆర్ఎంపీ డాక్టర్‌కు ఆఫర్.. చివరికి..


కేసీఆర్‌తో పాటు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమన్న రేవంత్ !
రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. లై డిటెక్టర్ పరీక్షకు సమయం, తేదీ ఖరారు చేయాలని సవాల్ చేశారు. అయితే ఇక్కడా కేటీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి మరో మెలిక పెట్టారు. కేసీఆర్‌పై ఉన్న సీబీఐ, సహారా కేసులపైనా కేసీఆర్‌కు లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలన్నారు.



Also Read : కేటీఆర్‌కి అరుదైన ఆహ్వానం, ఈ ఛాన్స్ అందరికీ రాదట..! థ్యాంక్స్ చెప్పిన మంత్రి


డ్రగ్స్ కేసును వ్యూహాత్మకంగా హైలెట్ చేస్తున్న కాంగ్రెస్ !
కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా డ్రగ్స్ కేసును తెలంగాణలో రాజకీయ అంశంగా మారుస్తున్నట్లుగా భావిస్తున్నారు. మొదటి నుంచి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పేరును డ్రగ్స్ వ్యవహారంలో మరింతగా నాన్చే వ్యూహం అవలంభిస్తున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ కూడా అంతే దూకుడుగా ఉన్నారు. కేటీఆర్‌ను పరోక్షంగా "బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డ్రగ్స్"గా అభివర్ణిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. 



కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయా ?
ప్రస్తుతం తెలంగాణలో డ్రగ్స్ అంశం అంత తేలికగా పాతబడే అవకాశం కనిపించడం లేదు. ఈడీ విచారణ ఇంకా కొనసాగుతోంది. అదేసమయంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ దర్యాప్తు వివరాలను ఇవ్వడానికి నిరాకరించడం మరింత వివాదాస్పదం అవుతోంది. ఈ అంశం చుట్టూ తిరిగే రాజకీయంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


Also Read : స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ.. ప్రధాని మోదీని ఆహ్వానించిన చిన్న జీయర్ స్వామి