ABP  WhatsApp

Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

ABP Desam Updated at: 02 Jan 2022 11:51 AM (IST)
Edited By: Murali Krishna

పెళ్లికి ముందు తమకు ఉన్న రోగాలు, జబ్బులను దాయటం మోసం చేయటమేనని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

NEXT PREV

దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తనను మోసం చేసి వివాహం చేశారని ఓ భర్త వేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం ఆ పెళ్లిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెళ్లి చేసేముందు అన్ని విషయాలు ఇరు వర్గాలు బహిర్గతం చేయాలని జబ్బులు, రోగాలను రహస్యంగా ఉంచరాదని ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.


ఓ వ్యక్తి ఆరోగ్యం క్షీణించడం తన తప్పు కాదని.. అయితే అది పెళ్లి కోసం దాయడం కచ్చితంగా మోసమేనని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మిత్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. 



మానసిక రోగంతో బాధపడుతోన్న భాగస్వామితో ఉండటం అంత సులభం కాదు. అది బాధపడుతోన్న వ్యక్తికే కాకుండా పెళ్లి చేసుకున్నవారికి కూడా సవాలే. ఇలాంటి సమయంలో ఇరువురి మధ్య అర్థం చేసుకునేతనం ఉండాలి. అందులోనూ ఇరువురిలో ఒకరు మానసిక రోగంతో బాధపడుతున్నప్పుడు మరొకరి మద్దతు కావాలి. కానీ ఈ కేసులో అమ్మాయి మానసిక రోగంతో బాధపుడుతుందనే విషయాన్ని దాచి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. దీని వల్ల ఆయన తన జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయాన్ని.. ఆనందంగా గడపాల్సిన కాలాన్ని కోల్పోయారు. ఇది కచ్చితంగా మోసమే. -                                               దిల్లీ హైకోర్టు


పెళ్లికి ముందే..


తన భార్యకు పెళ్లికి ముందే తీవ్రమైన తలనొప్పి ఉండేదని.. దీని వల్ల చదువు కూడా మానేసిందని భర్త ఆరోపించినట్లు కోర్టు పేర్కొంది. అయితే సాధారణమైన తలనొప్పికి చదువు మానేయాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. మానసిక రోగంతో బాధపడేవారికి కూడా తలనొప్పి ఓ లక్షణమేనని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయాన్ని పెళ్లి చేసుకునే అబ్బాయికి ముందే చెప్పి ఉండాల్సిందని కోర్టు పేర్కొంది. ఇలా చెప్పకపోవడం ముమ్మాటికి మోసమేనని.. కనుక ఈ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.


ఇదే కేసు..


2005 డిసెంబర్ 10న తనకు వివాహం జరిగిందని పిటిషన్‌లో బాధిత భర్త పేర్కొన్నాడు. తన భార్య మనోరోగంతో బాధపడుతుందనే విషయాన్ని ఆమె తల్లిదండ్రులు దాచి వివాహం చేశారని ఆరోపించాడు. తన భార్య ఎక్యూట్ స్కిజోఫ్రెనియాతో పెళ్లికి ముందు నుంచే బాధపడుతుందని పేర్కొన్నాడు. పెళ్లి జరిగిన నాటి నుంచి హనీమూన్ సమయంలోనూ అసాధారణంగా ప్రవర్తించిందని తెలిపాడు. 


దీంతో 2006లో జీబీ పంత్ ఆసుపత్రి, ఎయిమ్స్, హిందూ రావ్ ఆసుపత్రిలో తన భార్యను చూపించినట్లు చెప్పాడు. అయితే ఆ వైద్యుల వద్ద తాను అంతుకుముందే చికిత్స తీసుకున్నట్లు తన భార్య ఒప్పుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నాడు. సదరు వైద్యులు ఆమె ఎక్యూట్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు చెప్పారన్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 02 Jan 2022 11:48 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.