Covid-19 Cases in India: 


పెరుగుతున్న కేసులు..


కొవిడ్ కేసులు పెరుగుతున్న (India Covid19 Cases ) నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్‌ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా. ఈ కేసులపై నిఘా పెంచాలని,ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులకు ఈ సూచనలు చేశారు మంత్రి. అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వెల్లడించారు. అన్ని హాస్పిటల్స్‌లోనూ మాక్‌ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. 


"ఇది కలిసి కట్టుగా పని చేయాల్సిన సమయం. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. అలా భయపడాల్సిన పని లేదు. హాస్పిటల్స్‌లో మాక్‌ డ్రిల్స్ నిర్వహించాలి. ఎలాంటి ఉపద్రవాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. మూడు నెలలకోసారి ఆసుపత్రి యాజమాన్యాలు వసతులను సమీక్షించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సాయం అందుతుంది. ఆరోగ్యం విషయంలో రాజకీయాలకు తావులేదు"


- మన్‌సుఖ్ మాండవియ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి


 






 శీతాకాలం కావడం వల్ల వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందుకే...అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు చేశారు మాండవియ. శీతాకాలం, పండుగలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 






కేరళలో కరోనా వైరస్ సబ్ వేరియంట్ జేఎన్1 కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు భారత్ సహా 38 దేశాల్లోనూ జేఎన్1 వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అవసరం ఉన్న చోట వీలైనన్ని ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇంకా అనుమానం ఉన్న పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి వేరియంట్ ను తెలుసుకునేందుకు జీనోమ్ సిక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని చెప్పింది. త్వరలో పండుగ సీజన్ ఉండటంతో ఇప్పటికే నియంత్రణ చర్యలు చేపట్టాలని, లేకపోతే రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అలర్ట్ చేసింది. వయసు పైబడిన వారిని, చిన్నారులను, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా సూచనలో పేర్కొంది.


Also Read: అమెరికా ఆరోపణల్ని పరిశీలిస్తాం, గురుపత్వంత్ సింగ్ వివాదంపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ