US Murder Plot Claims:

గురుపత్వంత్‌ సింగ్‌పై హత్యాయత్నం..? 

ఖలిస్థాన్‌ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ని (Gurpatwat Sing Pannun Assassination Plot) ఓ భారతీయుడు హత్య చేయించేందుకు ప్లాన్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే అమెరికా పలుసార్లు ప్రస్తావించింది. గురుపత్వంత్‌ని చంపేందుకు భారత్‌కు చెందిన ఓ అధికారి అమెరికాలో ఓ గ్యాంగ్‌స్టర్‌కి సుపారీ ఇచ్చినట్టు ఆరోపిస్తోంది అమెరికా. అయితే..ఈ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఈ ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతే కాదు. ఇలాంటి వివాదాల కారణంగా భారత్, అమెరికా మధ్య మైత్రికి ఎలాంటి ఇబ్బందీ రాదని తేల్చి చెప్పారట. అగ్రరాజ్యంతో భారత్‌కి సుస్థిరమైన బంధం కొనసాగుతుందని మోదీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. Financial Times కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అమెరికా ఇచ్చిన ప్రతి సమాచారాన్నీ పరిగణనలోకి తీసుకుంటామని, వాటిని కచ్చితంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. భారతీయ పౌరులు ఎవరు మంచి చేసినా చెడు చేసినా కచ్చితంగా పరిశీలిస్తామని, చట్టప్రకారమే నడుచుకుంటామని మోదీ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. 

అమెరికాలోనే గురుపత్వంత్ సింగ్‌ని చంపేందుకు ఓ భారతీయ అధికారి ఓ వ్యక్తిని పురమాయించినట్టు అమెరికా ఆరోపించింది. నిజానికి గురుపత్వంత్‌పై భారత్ ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తోంది. భారత్‌పై విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాడని మండి పడుతోంది. 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ సిక్కు వేర్పాటువాదిపై పశ్చిమ దేశాలు ఏ మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదని పలు సందర్భాల్లో విమర్శించింది. అయితే అమెరికా ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడించారు. అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌లో కెనడాలో హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనకాల భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇప్పుడు అమెరికా కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తోంది.