Delhi Liquor Policy Case: 


దేశవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు 


ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ భారత్‌లో 40 చోట్ల ఈడీ, సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నాయి. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్, సీబీఐ, భాజపా చెబుతున్న మాటల్లో పొంతన లేదని విమర్శించారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంత మొత్తం స్కామ్‌ జరిగిందో చెప్పమంటే...వాళ్లంతా సంబంధం లేకుండా లెక్కలు బయట పెడుతున్నారని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేజ్రీవాల్...అసలు ఇందులో స్కామ్ ఏముందో తనకు అర్థం కావటం లేదని అన్నారు. "కొందరు భాజపా నేతలు రూ.8 వేల కోట్ల స్కామ్ అంటున్నారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రూ.144 కోట్ల అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. సీబీఐ FIRలో మాత్రం రూ.కోటి కోట్ చేశారు. ఇందులో అక్రమాలు ఎక్కడ జరిగాయో నాకైతే అర్థం కావట్లేదు" అని కామెంట్ చేశారు కేజ్రీవాల్. 


ఏపీ, కర్ణాటక, తమిళనాడులోనూ..


ఇలా చేస్తే దేశం అభివృద్ధి చెందదని, అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసినప్పటి నుంచి అలజడి మొదలైంది. ఆయనతో పాటు మరి కొందరు నేతల్నీ ఈ జాబితాలో చేర్చారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీతో ఇంకెవరికి సంబంధాలున్నాయో విచారణ కొనసాగిస్తోంది సీబీఐ. అటు ఈడీ కూడా సోదాలు చేపడుతూనే ఉంది. లిక్కర్ బిజినెస్‌ మేన్, డిస్ట్రిబ్యూటర్‌లు, సప్లై చైన్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న వారి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ ఎన్‌సీఆర్, తెలంగాణలో ఈ రెయిడ్స్ నడుస్తున్నాయి. ఆగస్టు 19వ తేదీన ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు నిర్వహించింది CBI. అప్పటి నుంచి ఆప్, భాజపా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 


హైదరాబాద్‌పై దృష్టి..


ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ సహా 43 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అటు నెల్లూరులోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుపుతోంది. ఢిల్లీ లోథీ రోడ్ లోని 95 నెం. బంగ్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఇందిరాపార్క్ చౌరస్థాలోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో సోదాలు జరుగుతున్నాయి. రాయదుర్గంలోని జయభేరి సౌత్ బ్లాక్ లో అభినయ్ రెడ్డి అనే వ్యాపారవేత్త ఇంట్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అటు తిహార్ జైలులో సత్యేంద్ర జైన్ ను ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు వెళ్లారు. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గతంలో ఓ సారి దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ... ఇప్పుడు కేవలం హైదరాబాద్ లో జరిగిన వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.  ఇప్పటికే హైదరాబాద్ సిటీలో రెండుసార్లు సోదాలు జరిపింది. ఇప్పుడు మూడోసారి పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతో ఈ స్కాంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గత తనిఖీల సమయంలో రామచంద్రపిళ్లై ఇల్లు, ఆఫీస్ లలో సోదాలు జరిగాయి. ఇప్పుడు ఆడిటర్ అయిన గోరంట్ల అండ్ అసోసియేట్స్‌ ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లోనూ సోదాలు జరగడం చర్చనీయాంశమవుతోంది. 


Also Read: MLC Kavitha : ఈడీ నోటీసులు రాలేదు, ఢిల్లీ నుంచి మీడియాను తప్పుదోవ పట్టించారు-ఎమ్మెల్సీ కవిత !