China Covid-19 Surge:


రోగనిరోధక శక్తి కోసం..


చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలందరూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. స్పల్ప లక్షణాలున్న వాళ్లు ఇంట్లోనే ఐసోలేట్ అవుతూ చికిత్స తీసుకుంటున్నారు. మరి కొందరు కేవలం మెడిసిన్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలూ వెతుక్కుం టున్నారు. ఇందులో భాగంగానే మార్కెట్‌లలో రద్దీ పెరుగుతోంది. అందరూ నిమ్మకాయలు కొనుగోలు చేసేందుకు క్యూలు కడుతున్నారు. బీజింగ్, షాంఘైల్లో ఎక్కడ మార్కెట్లలో చూసినా నిమ్మకాయలకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. జలుబు, జ్వరానికి సంబంధించిన మందులకు కొరత ఏర్పడటం వల్ల అందరూ C విటమిన్ ఎక్కువగా ఉన్న నిమ్మకాయలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. C విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మందుల ద్వారా కాకుండా ఇలా సహజంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటున్న వాళ్లంతా ఇలా మార్కెట్‌లోకి వచ్చి గంటల తరబడి క్యూలో నిలుచుని మరీ నిమ్మకాయలు కొనుక్కెళ్తున్నారు. నిమ్మకాయలతో కరోనా తగ్గుతుందన్న సైంటిఫిక్ ప్రూఫ్ ఎక్కడా లేకపోయినా..పలువురు వైద్యులు మాత్రం కొంత మేర కరోనాను కట్టడి చేయొచ్చని చెప్పారు. అందుకే...చైనా పౌరులు ఇలా మార్కెట్‌లకు వరుస కడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిమ్మకాయల కోసం కింద మీద పడుతూ బాక్సులకు బాక్సులే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల తోపులాటలూ జరుగుతున్నాయి. 






నిబంధనలు ఎత్తేయడంతో..


చైనాలో కరోనా నిబంధనలను ఎత్తేసిన తర్వాత పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. పెరుగుతున్న కేసులతో చైనాలోని ఆసుపత్రులు కిటకిటలడుతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ అంచనా వేశారు. ఎరిక్ సోమవారం ట్విట్టర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉందని.. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి  16 మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. 
" చైనాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చైనాలో ఉన్న ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉంది. వ్యాధి సోకిన ఒక్క వ్యక్తి వల్ల 16 మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. మీరు చేయాల్సిన పని ఒక్కటే.. మీరు, మీ కుటుంబం, 
మీ పొరుగువారు అంతా.. బైవాలేంట్ వ్యాక్సిన్ తీసుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఏంటంటే.. ఎవరైతే రోగాల బారిన పడాలి అనుకుంటున్నారో పడని, ఎవరైతే మరణించాలి అనుకుంటున్నారో మరణించని 
అని అనుకుంటుంది. "
-                                   ఎరిక్ ఫెఇగ్ల్- డింగ్, ఎపిడెమియాలజిస్ట్


చైనా తన కరోనా కట్టడి నిబంధనలను ఇలానే సడలిస్తే మిలియన్ కంటే ఎక్కువ మంది మరణించే ప్రమాదం ఉందని ఓ అమెరికా సంస్థ పేర్కొంది. ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ మేట్రిక్స్ అండ్ ఎవల్యువేషన్(ఐఎచ్ఎంఇ) అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2023 ఏప్రిల్ 1 వరకు చైనాలో 3,22,000 కరోనా మరణాలు సంభవించోచ్చని తెలిపింది. ప్రజలు ఒక నెలపాటు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో చైనా తన జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేసింది. 


Also Read: Covid-19 Vaccine:బూస్టర్ తీసుకుంటే సరిపోతుందా, నాలుగో డోస్ కూడా అవసరమా - ఎక్స్‌పర్ట్స్‌ ఏమంటున్నారు?