China Apps Ban:


138 బెట్టింగ్‌ యాప్స్‌ బ్యాన్ 


లోన్‌ యాప్స్‌ ఎంత మంది ప్రాణాలను బలిగొంటున్నాయో చూస్తూనే ఉన్నాం. రోజూ ఏదో ఓ మూల ఎవరో ఒకరు ఈ లోన్ యాప్‌ల వేధింపులకు గురవుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి యాప్స్‌పై ఇప్పటికే కేంద్రం ప్రత్యేక నిఘా పెట్టింది. అనధికారిక యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే చర్యలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో బెట్టింగ్ యాప్స్‌పైనా కొరడా ఝుళిపించింది. 138 బెట్టింగ్ యాప్స్‌తో పాటు 94  లోన్ యాప్స్‌పై నిషేధం విధించింది. ఇవన్నీ చైనాకు చెందినవే. సమస్య తీవ్రత ఆధారంగా వెంటనే ఈ నిషేధాన్ని అమల్లోకి  తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ సమైక్యతను దెబ్బ తీసే విధంగా ఉన్న యాప్స్‌ను తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది. గతేడాది దేశ భద్రతకు భంగం కలిగిస్తున్న 54 చైనా యాప్స్‌ను నిషేధించింది కేంద్రం. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను సేకరించి దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తించిన కేంద్రం...వాటిని తొలగించింది. పౌరుల ప్రైవసీని దెబ్బ తీసే యాప్స్‌ పని పడతామని తేల్చి చెప్పింది. 2020లోనూ 59 యాప్స్‌ను బ్యాన్ చేసింది. ఆ తరవాత అదే ఏడాది సెప్టెంబర్‌లో 118 యాప్స్‌ని బ్లాక్ చేసింది. 


RBIకి ఆదేశాలు..


చట్ట విరుద్దమైన లోన్ యాప్‌లపై కేంద్రం సీరియస్ అయింది. వీటిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో గతేడాది ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అక్రమ లోన్ యాప్‌లపై కఠిన చర్యలకు ప్రణాళిక రచించింది. చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్‌బీఐకు కేంద్రం ఆదేశించింది. వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్‌లలో హోస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అక్రమ లోన్ యాప్‌ల లావాదేవీలపై ఈడీ, సీబీఐ దృష్టి సారించాలని నిర్ణయించింది. అక్రమ లోన్ యాప్‌ల ఆట కట్టించేందుకు అన్ని మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఆన్లైన్ లోన్ యాప్ ల ఆగడాలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది బలైపోయారు. లోన్ యాప్‌లో రుణం తీసుకుంటే ఇక చావే శరణ్యం అన్నంతగా వేధిస్తున్నారు రికవరీ ఏజెంట్లు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది ఉసురు తీశాయి లోన్ యాప్‌లు. ఇటీవల రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు కారణమయ్యాయి. 


గూగుల్ కూడా..


కేంద్ర ప్రభుత్వం తరహాలోనే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆలోచిస్తోంది. జనాలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న లోన్ యాప్స్ పై ఉక్కుపాదం మోపింది. సుమారు 2 వేల పర్సనల్ లోన్ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇందులో చాలా వరకు విదేశాలకు చెందిన లోన్ యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ భారతీయులను టార్గెట్ చేసుకుని తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి కారణంగా అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గూగుల్ గుర్తించింది. దీంతో స్థానిక చట్ట సంస్థల అభిప్రాయాల మేరకు వీటిని తొలగిస్తున్నట్లు గూగుల్ ఆసియా పసిఫిక్ సీనియర్ డైరెక్టర్ సాయికత్ మిత్రా వెల్లడించారు. మున్ముందు మరిన్ని యాప్స్ మీద వేటు వేయబోతున్నట్లు తెలిపారు. ఇలాంటి యాప్స్ నుంచి రక్షణ కోసం పాలసీ విధానంలో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.    


Also Read: Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?