సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ ) ఎన్ని కేసులు పెడుతుందో తెలుస్తుంది కానీ ఎన్ని కేసుల్లో నిందితులకు శిక్షలు వేయించగలుగుతుందో మాత్రం ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. కానీ అత్యధిక కేసుల్లో నేరాలను నిరూపణ చేయలేకపోతోందన్న విషయం సంచలనాత్మక కేసులు వీగిపోయినప్పుడు ప్రచారంలోకి వస్తూ ఉంటుంది. సీబీఐ ఈ తరహా పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు న్యాయవాదుల అరెస్టుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంలో సీబీఐ అధికారులు సరైన వివరాలు సమర్పించకపోవడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.  సీబీఐ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 


సీబీఐ చేపట్టిన కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి కనిపించడం లేదని ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం మండిపడింది. ఇప్పటివరకు సీబీఐ ఎన్ని కేసులు చేపట్టింది?, ఎన్ని నిరూపించింది?, ఎందరికి శిక్ష పడింది?, ఎన్ని పెండింగ్‌ కేసులు ఉన్నాయో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ... జస్టిస్ సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఓ కేసు విషయంలో పంజరంలో చిలుకకు స్వేచ్ఛ అవసరం అంటూ.. మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను జస్టిస్ కౌల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సిబ్బంది, మౌలిక వసతుల లేమి కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశించారు.


సీబీఐ నమోదు చేస్తున్న కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. కేసులు నమోదు చేస్తారు.. విచారణ చేస్తారు కానీ తర్వాత అవి ఏమవుతాయో ఎవరికీ తెలియదు. అలాంటి కేసులు వేలల్లో ఉంటాయన్న ప్రచారం ఉంది. కానీ వివరాలేమీ బయటకు రావు. ఇరవై ఏళ్ల కిందటి సీబీఐ కేసులూ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అవసరమైనప్పుడు మాత్రం ఆ కేసులు బయటకు వస్తూంటాయన్న విమర్శలు మాత్రం ఉన్నాయి. 





రెండు వారాల  కిందట మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కూడా సీబీఐ విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది.  సీబీఐని రాజకీయ పంజరం నుంచి వదిలి పెట్టాలని .. సీబీఐని పటిష్ట పరిచేందుకు మొత్తం 12 సూచనలను ధర్మాసనం చేసింది.  కాగ్, ఎన్నికల కమిషన్ తరహాలో స్వతంత్ర ప్రతిపత్తి సీబీఐకి కల్పించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ డైరక్టర్‌కి ప్రభుత్వ కార్యదర్శితో సమానమైన అధికారంతో పాటు  అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌, యూకేలోని స్కాట్లాండ్ యార్డ్ వంటి వ్యవస్థలతో సమానంగా ఆధునిక సదుపాయాలు కల్పించాలని కూడా ఆదేశించింది. అదే తరహాలో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా  సీబీఐ పనితీరుపై సమీక్ష ప్రారంభించడం ఆసక్తి రేపుతోంది. 


    Also Read : హిందువుల పండుగలకే కరోనా వస్తుందా..?