Kanpur youth thrashed by parents in public: కాన్పూర్ లో బాగా బిజీగా ఉండే కూడలిలో ఓ యువ జంట బండి మీద కూర్చుని ఒకే ప్లేట్లో ఒకే స్పూన్తో నూడిల్స్ ఆస్వాదిస్తున్నారు. ఒకరి కళ్లల్లో ఒకరిని చూసుకుంటూ తింటున్నారు. కానీ ఈ లోపు ఎక్కడి నుంచి వచ్చారో కానీ.. ఓ మహిళతో సహా కొంత మంది వచ్చి వారిని చితక్కొట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆ యువకుడ్ని ఓ మహిళ చెప్పుతీసుకుని కొట్టడం ప్రారంభించారు. చాలా మంది ఆ అమ్మాయి తరపు వారేమో ఆనుకున్నారు. కానీ నిజం మాత్రం .. ఆ మహిళ అబ్బాయి తల్లి. ఈ కారణంగా ఎవరూ అడ్డు చెప్పడానికి.. అడ్డుకోవడానికి కూడా ఎవరూ రాలేదు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో తమ కుమారుడి ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా వారిని చితకబాదారు. పోలీసుల కథనం ప్రకారం. కాన్పూర్లోని గుజైనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్గోపాల్ కూడలి వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రోహిత్ (21) అనే యువకుడు తన స్నేహితురాలు (19) తో కలిసి చౌమీన్ (నూడుల్స్) తింటున్నాడు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న రోహిత్ తల్లిదండ్రులు శివ్కరణ్, సుశీల.. కుమారుడి ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో ఒక్కసారిగా వారిద్దరిపై దాడికి దిగారు.
రోహిత్ తల్లి సుశీల యువ జంటను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అమ్మాయి, అబ్బాయి వారు టూవీలర్పై తప్పించుకునే ప్రయత్నం చేయగా సుశీల యువతి జుట్టు పట్టుకుని లాగి మరీ కొట్టింది. రోహిత్ తండ్రి శివ్కరణ్ తన కొడుకును చెప్పుతో కొట్టాడు.
పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరు పక్షాలను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. ఈ ఘటనలో ఇరు పక్షాలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. నడిరోడ్డుపై జరిగిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.