Nirmala Sitharaman Budget Saree: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగానే ఆమె ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరను ధరించారు. ఇలా నేత చీరలను ధరిస్తూ.. నేతన్నలను, చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. నిర్మలా సీతారామన్ తన ఐదవ బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు ఎరుపు రంగు చీర నలుపు, బంగారు వర్ణం బార్డర్ ఉన్న చీరను కట్టుకున్నారు. సింపుల్ గా, హుందాగా కనిపించేలా ఓ చైన్, రెండు బంగారు గాజులను మాత్రమే వేసుకున్నారు. చేనేత చీరల పట్ల నిర్మలా సీతారామన్‌కు ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఎప్పుడూ పార్లమెంటుకు వచ్చినా చేనేత చీరలను మాత్రమే ధరిస్తూ చాలా హుందాగా కనిపిస్తుంటారు. 


టెంపుల్ సారీ ప్రాముఖ్యత..


టెంపుల్ సారీలు సాధారణంగా కాటన్, సిల్క్ లేదా మిక్స్‌తో తయారు చేస్తారు. వీటిని ఎక్కువగా ప్రత్యేక సందర్భాలలో ధరిస్తారు. ఆర్థిక మంత్రి రెడ్ టెంపుల్ చీరకు బ్లాక్, గోల్డ్ కలర్ బార్డర్ ఉంది. లైన్ బార్డర్ హుందాతనాన్ని తీసుకొస్తుంది. ఈ రెడ్ కలర్ చీరపైకి నిర్మలా సీతారామన్ రన్నింగ్ బ్లౌజ్ ధరించారు. చీరపై నక్షత్రాల డిజైన్ చక్కగా ఉంది. 


శక్తికి, ప్రేమకు చిహ్నం..


హిందూ సాంప్రదాయంలో ఎరుపు రంగును దుర్గాదేవితో పోలుస్తుంటారు. ఎరుపు రంగు స్త్రీ శక్తిని సూచిస్తుంది. సామర్థ్యాన్ని, ప్రేమను, పని పట్ల నిబద్ధతను, బలాన్ని, అంతకుమించి ధైర్యాన్ని ఎరుపు రంగు సూచిస్తుంది. 2024లో జరగబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో నిర్మలా ఎరుపు రంగు చీరను ధరించి తన మనో ధైర్యాన్ని సూచించారు. 


నిర్మలా స్టైల్ సెపరేట్..


ఆర్థిక శాక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కువగా చేనేత, కాటన్ చీరలను ధరిస్తుంటారు. ఈ చీరలు నిర్మలా సీతారామన్ కు చాాలా హుందాగా ఉంటాయి. సాదా చీరలు ధరించే ఆర్థిక మంత్రి చీరపైకి పెద్దగా యాక్ససెరీస్ కూడా ధరించరు. మెడలో సన్నని చైన్ మాత్రమే వేసుకుంటారు. చిన్న ఇయర్ రింగ్స్ ధరిస్తారు. చేతులకు ఒకటి లేదా రెండు గాజులు మాత్రమే ధరించి కనిపిస్తారు. ఎక్కువగా చీరలో రన్నింగ్ బ్లౌజ్ లను ధరిస్తుంటారు. ఎప్పుడూ చిరునవ్వుతో, హుందాగా కనిపించడానికి నిర్మలా సీతారామన్ ఇష్టపడతారు. 


ప్రకాశవంతమైన కలర్స్..


సాధారణంగా బడ్జెట్ సమావేశాలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకాశవంతమైన రంగు చీరలను ధరిస్తుంటారు. 2023 బడ్జెట్ కు ఆమె పూర్తి ఎరుపు చీరలో కనిపించారు. గతేడాది బడ్జెట్ సమావేశానికి ఆమె మధురమైన శక్తికి సూచికైన మెరూన్ కలర్ చీర ధరించారు.  2021లో నిర్మలా సీతారామన్ ఎరుపు మరియు తెలుపు రంగు పోచంపల్లి చేనేత చీరలో పల్లు చుట్టూ ఇక్కత్ నమూనాలతో కనిపించారు. 2020లో నిర్మలా సీతారామన్ పసుపు పట్టు చీర కట్టుకున్నారు. 2019లో తన మొదటి బడ్జెట్ ప్రెజెంటేషన్ కోసం, సీతారామన్ ప్రకాశవంతమైన గులాబీ రంగు, బంగారు అంచు గల మంగళగిరి చీరను ధరించారు. అదే సంవత్సరంలో, ఆమె లెడ్జర్ పేపర్‌లను బ్రీఫ్‌కేస్‌లో తీసుకువచ్చే 'బహీ ఖాతా' అనే సంప్రదాయానికి స్వస్తి పలికారు. బడ్జెట్ పత్రాలను సిల్క్ రెడ్ క్లాత్‌లో చుట్టి, పైన జాతీయ చిహ్నాన్ని ఉంచారు.