వరుస బాంబు పేలుళ్లు అఫ్గానిస్తాన్ ప్రజలను వణికిస్తున్నాయి. జంట పేలుళ్లు జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే మరో పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో కొద్దిసేపటి క్రితం మరో బాంబు పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాబూల్‌లోని ఖవాజా బుగ్రా, పీడీ 15 ప్రాంతంలో పేలుడు జరిగినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. కాబూల్ విమానాశ్రయానికి ఉత్తరం వైపున ఉన్న ఒక ఇంటిని రాకెట్ ఢీకొట్టిందని, దీంతో భారీ పేలుడు సంభవించినట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


సూసైడ్ బాంబర్‌పై అమెరికా దాడి..
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో ఆత్మాహుతి దాడి త్రుటిలో తప్పినట్లు తెలుస్తోంది. విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి దాడికి యత్నించిన ఒక వ్యక్తిని అమెరికా బలగాలు మట్టుబెట్టాయనే వార్తలు వస్తున్నాయి.  అమెరికా తమ దేశ పౌరుల తరలింపు ప్రక్రియను చేపడుతున్న వేళ ఆత్మాహుతి దాడికి ఓ వాహనంలో సిద్ధంగా ఉన్న వ్యక్తిపై (సూసైడ్ బాంబర్‌) యూఎస్ బలగాలు వైమానిక దాడి జరిపాయని తాలిబన్‌ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. మరణించిన వ్యక్తి ఐసిస్‌-కె ఉగ్రవాదిగా గుర్తించారు. 


రాబోయే రెండు రోజుల్లో కాబూల్ విమానాశ్రయంలో మరోసారి బాంబు పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈరోజు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో పౌరులంతా కాబూల్ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని సూచించారు. కాబూల్‌లోని అమెరికన్ రాయబార కార్యాలయం కూడా ఈరోజు ఉదయం అక్కడి అమెరికన్లకు హెచ్చరిక జారీ చేసింది. కాబుల్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో బాంబు దాడి జరగవచ్చని విశ్వసనీయ సమాచారం అందిందని.. కాబట్టి పౌరులంతా కాబుల్ ఎయిర్ పోర్టు పరిసరాలను ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. అగ్రరాజ్యం హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పేలుడు సంభవించింది. 






కాబూల్ విమానాశ్రయం వెలుపల గురువారం జరిగిన జంట పేలుళ్లలో 180 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో 13 మంది అమెరికా రక్షణ సిబ్బంది సహా చిన్నారులు ఉన్నారు. ఈ పేలుళ్లకు తామే కారణమని ఐసిస్-కే ఉగ్రవాదులు ప్రకటించారు. దాడి జరిగిన కొద్ది గంటలకే అమెరికా ప్రతీకారంగా డ్రోన్ దాడులకు దిగింది. అఫ్గానిస్తాన్‌లో నంగహర్‌ ప్రావిన్స్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఖోరసాన్‌ స్థావరాలపై మానవ రహిత డ్రోన్లతో దాడులు నిర్వహించింది. ఇందులో ఆత్మాహుతి దాడికి సూత్రధారి సహా మరో ఉగ్రవాది హతమైనట్లు పెంటగాన్ ప్రకటించింది. డ్రోన్ దాడులను ఇంతటితో ఆపబోమని, మరిన్ని దాడులు చేస్తామని ఐసిస్-కే ఉగ్రవాదులకు బైడెన్‌ హెచ్చరికలు జారీ చేశారు. తమ పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 


Also Read: Kabul Attack Warning: 24-36 గంటల్లో మరో ఉగ్ర దాడి జరిగే ఛాన్స్.. బైడెన్ హెచ్చరిక, కీలక ఆదేశాలు


Also Read: India-Afghan Relations: తాలిబన్ల పాలన భారత్ కు నష్టమే!.. అఫ్గాన్ లో భారత్ ఖర్చు పెట్టిన సొమ్మెంతో తెలుసా!