BJP On AAP Govt: 


మీనాక్షి లేఖి విమర్శలు..


ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ..బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ రాజకీయ వేడిని పెంచేస్తున్నారు. బీజేపీపై ఆప్...విమర్శలు గుప్పించిన ప్రతిసారీ...గట్టిగా బదులిస్తోంది కాషాయపార్టీ. ఈ క్రమంలోనే..కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఆప్‌పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. "ఆప్ పాపాలన్నీ కడిగితే నర్మదా నది కూడా కలుషితమై పోతుంది" అని విమర్శించారు. తీహార్‌ జైల్లో ఉన్న ఆప్ నేత సత్యేందర్ జైన్‌ను ఇప్పటి వరకూ మంత్రి పదవిలో నుంచి తొలగించలేదని
మండి పడ్డారు. పైగా...మసాజింగ్ నుంచి ప్యాక్డ్‌ ఫుడ్ అందించడం వరకూ సకల మర్యాదలూ లభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టడమే ఆప్ పని అని అన్నారు. "సత్యేందర్ జైన్‌ జైల్లో ఉన్నా ఆయన మర్యాదలకు తక్కువేమీ జరగడం లేదు. మంత్రి పదవి నుంచీ తొలగించలేదు. పోక్సో చట్టం కింద అరెస్టైన వ్యక్తితో సత్యేందర్ జైన్ సన్నిహితంగా ఉంటున్నారు. ఇలాంటి వ్యక్తుల వల్లే రాజకీయాలకు మచ్చ వస్తోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ మోసం చేయడం తప్ప మరింకేదీ చేయలేదు. ఎక్సైజ్ స్కామ్, క్లాస్‌రూమ్ స్కామ్ లాంటి కుంభకోణాలకు పాల్పడ్డారు" అని నిప్పులు చెరిగారు..కేంద్రమంత్రి మీనాక్షి లేఖి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌నూ విమర్శించారు. "ఢిల్లీలో బెదిరింపులు, స్కామ్‌లు ఎన్నైనా చేసుకోవచ్చు అని ఆప్ నేతలు అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన డబ్బుతో దేశమంతా  అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు. రాజకీయ నేతలకు సహనం ఎంతో ముఖ్యం. కానీ...ఆప్ నేతలకు అది లేనే లేదు. వీళ్లంతా తమకు తామే గొప్పవాళ్లమని, మంచి వాళ్లమని  సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారు. కానీ...నిజానిజాలేంటే ప్రజలే అర్థం చేసుకోవాలి. కేజ్రీవాల్ ఎంత అవినీతి పరుడో తెలుసుకోవాలి" అని అన్నారు. 


సత్యేందర్ చుట్టూ రాజకీయాలు..


ఇటు ఆప్ కూడా బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇస్తోంది. "అపవాదులు వేసి గెలిచాం. ఇవే అపవాదులను కొనసాగిస్తాం. అందుకే మాకు ఓటు వేయండి" అనేది బీజేపీ నినాదంగా మారిపోయిందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. "పని చేశాం. ఇకపైనా పని చేస్తాం. మాకు ఓటు వేయండి" అనేది కేజ్రీవాల్ నినాదం. సత్యేందర్ జైన్‌కు జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ లభిస్తుండటంపై వస్తున్న విమర్శల్నీ తిప్పికట్టింది 
ఆప్. "అమిత్ షా గుజరాత్‌ జైల్లో ఉన్నప్పుడు ఆయనకో  స్పెషల్ జైలు ఏర్పాటు చేశారు. సీబీఐ రికార్డుల్లోనూ ఇది ఉంది. చరిత్రలో ఈ స్థాయిలో ఎవరికీ వీఐపీ ట్రీట్‌మెంట్ లభించలేదు" అని ఆరోపిస్తోంది. తీహార్ జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్‌ ఎంత విలాసంగా గడుపుతున్నారో రుజువు చేసే వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇటీవలే.. ఆయన మసాజ్ చేసుకుంటున్న వీడియో సంచలనం కాగా...ఇప్పుడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జైలు గదిలో కూర్చుని హోటల్ ఫుడ్ తింటున్నారు సత్యేంద్ర జైన్. తీహార్ జైలు సిబ్బంది ప్రకారం..ఆయన 8 కిలోల బరువు పెరిగారని తెలుస్తోంది. అయితే...సత్యేంద్ర తరపున లాయర్ మాత్రం..ఆయన 28 కిలోలు తగ్గారని చెబుతున్నారు. తనకు సరైన ఆహారం అందించడం లేదని, మెడికల్ చెకప్స్ కూడాచేయించడం లేదని జైన్ ఆరోపిస్తున్న తరుణంలోనే...ఈ వీడియో బయటకు రావడం సంచలనమవుతోంది. అయితే...సత్యేంద్ర జైన్ కౌన్సిలర్, సీనియర్ అడ్వకేట్ రాహుల్ మెహ్రా...ఈడీ అధికారుల తీరుపై మండి పడుతున్నారు. "ఎంతో సున్నితమైన వివరాలను మీడియాకు లీక్ చేస్తున్నారు" అంటూ విమర్శిస్తున్నారు. 


Also Read: Elon Musk Net Worth: రోజుకు రూ.రెండున్నర వేల కోట్ల నష్టం, సగం సంపద ఆవిరి, ఇప్పటికీ ఆయనే నంబర్‌.1