Bilkis Bano: 


దోషులను విడుదల చేయడంపై అసహనం..


తనపై అత్యాచారం చేసిన దోషులను ముందస్తుగా విడుదల చేయడంపై బిల్కిస్ బానో చాలా రోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయానికి వాళ్లకు తగిన శిక్ష పడాల్సిందేనని అంటున్నారు. ఇప్పటికే...ఈ విడుదలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. బిల్కిస్ బానో కూడా న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టునీ ఆశ్రయించారు. 11 మంది దోషులను సత్ర్పవర్తన కింద విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టు గడప తొక్కారు. గుజరాత్ ప్రభుత్వం చెప్పిన 1992 నాటి రెమిషన్ పాలసీని అనుసరిస్తూ సుప్రీం కోర్టు వారి విడుదలను అంగీకరిస్తూ ఇచ్చిన తీర్పుని సవాలు చేశారు. దీనిపై రిట్ పిటిషన్ వేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ ముందు దీని గురించి ప్రస్తావన రాగా.."ఈ విషయాన్ని విచారిస్తాం" అని చెప్పారు. ఇరు పక్షాల పిటిషన్‌లను ఒకేసారి విచారించొచ్చా లేదా అనేది పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న జైలు నుంచి విడుదల చేశారు. అప్పటి నుంచి గుజరాత్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అంత దారుణానికి ఒడిగట్టిన వారిని అంత సులభంగా ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. బిల్కిస్ బానో కూడా ఈ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారు.  


సత్ప్రవర్తన కింద విడుదల: గుజరాత్ ప్రభుత్వం


2002లో గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానో అనే మహిళపై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే...వీరిని విడుదల చేసే సమయంలో గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 1992 జులై 9న పాస్ చేసిన రెమిషన్ పాలసీ ఆధారంగా చూపిస్తూ...ఈ నిర్ణయం సరైందేనని తేల్చి చెప్పింది. "జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లను సత్ప్రవర్తన కింద 14 ఏళ్ల జైలు శిక్ష తరవాత విడుదల చేసేందుకు అవకాశముంది" అని వివరణ కూడా ఇచ్చుకుంటోంది. బిల్కిస్‌ బానో కేసులో దోషులకు రెమిషన్‌ మంజూరు చేసి విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలవ్వగా...గుజరాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది సర్వోన్నత న్యాయస్థానం. అందులో భాగంగానే... గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్‌ను సమర్పించింది. గతంలోనే...సుప్రీం కోర్టు బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను విచారించింది. గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. అంతే కాదు. గుజరాత్ ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్కిస్ బానో కూడా ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కూడా. ఇప్పుడు ఈ కేసు సుప్రీం కోర్టుకు గడప తొక్కింది.


Also Read: Golden Tongue Mummies: పురావస్తు తవ్వకాల్లో బంగారు నాలుకల మమ్మీలు, గోల్డ్‌ కోటెడ్ ఎముకలు