ఏపీకి కచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన అధికార వైఎస్సార్‌సీపీ అడుగులు ముందుకేస్తోంది. ఈ మేరకు ఇటీవల మూడు రాజధానులకు మద్దతుగా వైజాగ్ లో విశాఖ గర్జన పేరుతో భారీ ర్యాలీ సభను నిర్వహిచారు వైసీపీ నేతలు. అయితే రాజధానుల వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు. ఏపీకి రాజధాని అమరావతే అనే విషయానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా రాజధానిని మార్చే ప్రసక్తే లేదన్నారు.  సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కిషన్ రెడ్డికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రాజధానుల వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారని గుర్తుచేశారు. 


కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదన్న కేంద్ర మంత్రి 
నేటి ఉదయం విజయవాడకు కిషన్ రెడ్డి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కిషన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి ఏలూరు, గుంటూరు జిల్లాల్లో కేంద్రమంత్రి పర్యటించనున్నారు. ఏపీకి మూడు రాజధానులు కాదని, కేవలం ఒక్క రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీకి రాజధాని అమరావతే అనే విషయానికి కట్టుబడి ఉన్నామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని మార్చే ప్రసక్తే లేదన్నారు కిషన్ రెడ్డి.  ఏపీలో రాజధానుల వివాదం, జనసేన అధినేతను విశాఖలో హోటల్ కు పరిమితం చేయడం, జనసేన నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంపై కిషన్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో ఎక్కడైనా కక్ష సాధింపు చర్యలు అనేది కరెక్ట్ కాదని సూచించారు. మొదట్నుంచీ తమ పార్టీ అదే చెబుతోందన్నారు. ధర్నా చేసిన రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వారికి న్యాయం చేసిందని గుర్తుచేశారు.






ఏలూరు, గుంటూరు జిల్లాల పర్యటనకు కిషన్ రెడ్డి 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ పథకం 12వ విడత నిధులను విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా రూ.16 వేల కోట్లను ప్రధాని మోదీ నేడు విడుదల చేయనున్న సందర్భంగా బీజేపీ ఏలూరులో రైతులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుగా విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, తదితర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో కలిసి- కిషన్ రెడ్డి ఏలూరుకు బయలుదేరనున్నారు.


విశాఖపట్నం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులపై దాడి కేసులో 92 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 71 మంది జనసేన నేతలు అరెస్ట్ కాగా, ఆదివారం రాత్రి విశాఖలోని ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పర్చారు. వీరిలో 62 మందికి 10 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. 9 మందికి రిమాండ్ విధించారు.