తనతో ఏడడుగులు నడిచిన భార్యకు...ఓ వ్యక్తి అదిరిపోయే కానుక ఇచ్చాడు. తనకు ఇష్టమైన ప్రాణ సఖి కోసం ఏకంగా చంద్రుడిపైనే స్థలం కొనుగోలు చేశాడు.  పశ్చిమ బెంగాల్ లోని ఝర్ గ్రామ్ జిల్లాకు చెందిన సంజయ్ మహతో...చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశాడు. దీన్ని తన భార్య అనుమికకు జన్మదినం సందర్భంగా ప్లేస్‌ను  గిఫ్ట్ గా ఇచ్చాడు. స్థలాన్ని కొనుగోలు చేయడానికి 10వేల రూపాయలు ఖర్చు చేశాడు. స్థలం పత్రాలను భార్యకు కానుకగా ఇచ్చాడు. భర్త ఇచ్చిన అదిరిపోయే గిఫ్ట్...ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయ్. ఈ వార్త దేశంలో చర్చనీయాంశంగా మారింది. 


సంజయ్ మహతో, అనుమిక ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమలో ఉన్నపుడే... చందమామను తెచ్చి ఇస్తానని అనుమికకు మాటిచ్చాడు సంజయ్. భార్యకు ఇచ్చిన మాట ప్రకారం...పెళ్లయిన తర్వాత మొదటి పుట్టిన రోజుకు హమీని నెరవేర్చాడు. పది వేల రూపాయలు ఖర్చు చేసి...చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశాడు. స్థలానికి సంబంధించిన పత్రాన్ని భార్యకు అందజేశాడు. భర్త ఇచ్చిన కానుక ఎంతో నచ్చిందని భార్య అనుమిక వెల్లడించింది. 


స్నేహితుడి సహాయంతో సంజయ్ లూనా...సొసైటీ ఇంటర్నేషనల్‌ను సంప్రదించాడు. చంద్రుడిపై ఎకరా స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు ఏడాది పట్టిందని సంజయ్ మహతో వెల్లడించాడు. చంద్రుడిపై స్థలాలను కొన్ని కంపెనీలు విక్రయిస్తున్నాయి. మరి అవి చెల్లుబాటవుతాయా లేదా అన్నది అంతుచిక్కని ప్రశ్నే.