చంద్రుడిపై రియల్‌ ఎస్టేట్‌ జోరుగా సాగుతోంది. భూముల అమ్మకాలు పెరుగుతున్నాయి. దొరికొందే ఛాన్స్‌ అంటూ చంద్రమండలంపై భూములు కొని పెట్టేసుకుంటున్నారు  చాలా మంది. మన తెలుగువారుకు ఇందులో ముందుంటున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన NRI బొడ్డు జగన్నాథరావు కూడా చంద్రుడిపై భూమి  కొన్నాడు. రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఉద్యోగరీత్యా న్యూయార్క్‌లో సెటిల్‌ అయిన జగన్నాథరావు 2005లో ఇంటర్నేషనల్‌ లూనార్‌ ల్యాండ్స్‌ రిజిస్ట్రీ గురించి  తెలుసుకున్నాడు. చంద్రునిపై భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ క్లెయిమ్‌ డీడ్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్ధ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 


చంద్రుడి భూమిన ఎలా కొనాలి..? ఎంతకు కొనాలి..? మీకెవరికైనా తెలుసా..? లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై  భూమిని విక్రయిస్తున్నాయి.  హైదరాబాద్, బెంగళూరుకు చెందిన పలువురు జాబిల్లిపై భూమి కొనుగోలు చేశారు. ఇటీవల తెలంగాణకు చెందిన మహిళ కూడా చంద్రుడిపై  భూమి కొన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అడుగుపెట్టిన రోజే తెలంగాణకు చెందిన NRI సాయి విజ్ఞత భూమి కొనుగోలు కోసం పెట్టుకున్న రిజిస్ట్రేషన్ పూర్తి  అయ్యింది. ఇప్పుడు వీరవల్లి వాసి జగన్నాథరావు కూడా చంద్రుడిపై రెండు ఎకరాలు కొన్నారు. 


లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నాయి. చంద్రునిపై ప్రయోగాలు, చంద్రమండల ప్రదేశాలపై  అన్వేషణ, అభివృద్ధి, పరిశోధనలకు ఆర్థిక సాయం చేసేందుకు అంతర్జాతీయంగా క్రౌడ్‌ ఫండింగ్‌ చేపట్టేందుకు లూనార్‌ రిపబ్లిక్‌ సొసైటీ. ఈ విషయం తెలుసుకున్న వీరవల్లి వాసి  జగన్నాథరావు.. న్యూయార్క్‌లోని లూనార్‌ రిపబ్లిక్‌ సొసైటీ ఆఫీసుకు వెళ్లి తన కుమార్తెలు మానస, కార్తీక పేరిట చెరో ఎకరం భూమి కొన్నాడు. చంద్రునిపై ఏయే అక్షాంశాలు,  రేఖాంశాల మధ్య భూమి కొనుగోలు చేశారో పూర్తి వివరాలతో లూనార్‌ రిపబ్లిక్‌ సొసైటీ ఆయనకు రిజిస్ట్రేషన్‌ క్లెయిమ్‌ డీడ్‌ ఇచ్చింది. 


చంద్రుడిపై భూమిని కొంటున్నారు సరే.. మరి హక్కుల మాటేమిటి అంటే.. చంద్రుడిపై భూమి కొనుగోలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. చంద్రుడిపై భూమిపై  కొనుగోలుదారులు యాజమాన్య హక్కులు పొందలేరు. ఆ భూమి వారి పేరుపై రిజిస్ట్రర్ అయ్యి ఉంటుంది. అంతవరకే. చంద్రుడితో సహా బాహ్య అంతరిక్షం ఎవరికీ సొంతంకాదని..  1967లో అమల్లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై భారత్ సహా 110 దేశాలు సంతకం చేశాయి. 1967, అక్టోబర్ 10న అమల్లోకి వచ్చిన ఔటర్ స్పేస్ ట్రీటీ  ప్రకారం చంద్రుడు ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. ఇది సింబాలిక్ మార్క్ మాత్రమే. దీనికి చట్టపరమైన చెల్లుబాటు లేదు. అయితే, నివాసయోగ్యంగా ఉంటే మాత్రం అక్కడ  నివసించవచ్చు.


చంద్రుడిపై భూమి కొనుగోలు చేయాలంటే లూనార్ రిజిస్ట్రీ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కేవలం డాలర్ల రూపంలోనే లావాదేవీలు  పూర్తి చేయాలి. అయితే.. చంద్రుడిపై భూమి విలువ ఎంతో తెలుసా..? చంద్రుడిపై ఎకరం భూమి విలువ 37.50 డాలర్లు. అంటే సుమారు రూ.3,200. ఇంత తక్కువ ధర  ఉండటంతో చంద్రుడిపై భూమిని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.