Army Truck Accident:



ఉత్తర సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురై 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. భారత సైన్యం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. మలుపు తిరిగే సమయంలో ఉన్నట్టుండి స్కిడ్‌ అయి పడిపోయిందని లోయలోకి పడిపోయిందని అధికారులు తెలిపారు. "దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ముగ్గురు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లతో పాటు 13 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ కఠిన సమయంలో ఆ సైనికుల కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ అండగా ఉంటుంది. నార్త్ సిక్కిం చాలా ప్రమాదకరమైన ప్రదేశం. చాలా రోజులుగా ఇక్కడ తీవ్రంగా మంచు కురుస్తోంది" అని ఇండియన్ ఆర్మీ విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. "రోడ్డు ప్రమాదంలో సైనికులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. వాళ్లు ఇన్నాళ్లు అందించిన సేవలను దేశం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.