ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిలబెడతాయి. కానీ ఎక్కువ మంది మనసు జంక్ ఫుడ్ వైపే మొగ్గు చూపుతుంది. వాటిని అతిగా తినడం వల్ల ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అందుకే శరీరం ఒకే రకమైన ఆహారానికి బానిస కాకుండా అన్నింటినీ సమతుల్యంగా తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీకెండ్ లో జంక్ ఫుడ్ తినాలని అనిపిస్తే అది తింటూనే వాటికి ఆరోగ్యకరమైన ఆహారాలు జత చేసుకోవాలి. అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే మీ ప్లేట్ ని పోషకాహారమైన ధాన్యాలు, సీ ఫుడ్, బీన్స్, కాయధాన్యాలతో నింపేయండి. ఈ ఆహార పదార్థాలను తప్పకుండా మీ డైట్లో చేర్చుకుంటే ఎటువంటి రోగాలు మీ దరిచేరవు.


ఆకుపచ్చ కూరగాయలు


వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఆకుపచ్చ కూరగాయాలు తీసుకోవాలి. బ్రొకోలి, బ్రస్సెల్ మొలకలు వంటి కూరగాయలు, కాలే, బచ్చలికూర వంటి ఆకుకూరలు మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.


బీన్స్, కాయధాన్యాలు


కనీసం వారానికి ఒకసారైన పప్పు తినాలి. బీన్స్, చిక్కుళ్ళని సూప్, క్యాస్రోల్స్, సలాడ్, డిప్ లకు జోడించుకోండి. ఇవి తింటే శరీరానికి తగినంత ప్రోటీన్ అందుతుంది. జీవక్రియని మరింత పెంచుతుంది.


తృణధాన్యాలు


ఆహారంలో రోజుకి కనీసం రెండు సార్లు తృణధాన్యాలు చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. గోధుమ పిండి,ఓట్మీల్, బార్లీ, ఉసిరి, క్వినోవా పిండి లేదా మల్టీ గ్రెయిన్ పిండిని ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఊబకాయాన్ని దూరం చేస్తుంది.


బెర్రీలు


ప్రతిరోజు రెండు లేదా నాలుగు బెర్రీలు తినేలా చూసుకోవాలి. రాస్ప్బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలను మీ డైట్‌లో జ్యూస్, బ్రేక్ ఫాస్ట్ లేదా డెజర్ట్‌ల రూపంలో కూడా చేర్చుకోవచ్చు.


చేపలు


వారానికి రెండు మూడు చేపలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సీ ఫుడ్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, హెర్రింగ్, బ్లూ ఫిష్ వంటి వాటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.


పెరుగు


కొన్ని అధ్యయనాల ప్రకారం 19 నుంచి 50 సంవత్సరాల మధ్య పురుషులు, స్త్రీలకు రోజుకి 1000ఎంజీ కాల్షియం అవసరమవుతుంది. యాభై ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి 1200 ఎంజీ అవసరం. రోజువారీ కాల్షియం అవసరాలని తీర్చడానికి తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు తీసుకోవచ్చు.


నట్స్, విత్తనాలు


ప్రతిరోజు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు లేదా ఇతర గింజలు తీసుకోవచ్చు. అల్పాహారంలో లేదంటే షేక్స్, స్మూతీస్ రూపంలో వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో పాటి పావు కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది.


నీరు


అన్నింటికంటే ముఖ్యమైనది నీరు పుష్కలంగా తాగడం. రోజుకి ఎనిమిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా టాక్సిన్స్ ను బయటకి పంపించి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పాలు తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుందా? అది ఎంతవరకు నిజం?