మాతృత్వం గొప్ప వరం. పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లి కావాలని,  ‘అమ్మా’ అని పిలిపించుకోవాలని కోరుకుంటుంది. తను తల్లి కాబోతుంది అనే విషయం తెలిసిన దగ్గర నుంచి బిడ్డని కనేంత వరకు ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకంగా ఉండాలని భావిస్తారు. గర్భవతి అని తెలిసిన తర్వాత మొదటి మూడు నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటామో చివరి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తారు. ఇటువంటి సమయంలో మహిళలు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అధిక రక్తపోటు, థైరాయిడ్, డయాబెటిక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాటిని సరైన సమయంలో గుర్తించి పరిష్కరించకపోతే తల్లి, బిడ్డల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే గర్భవతిగా ఉన్న సమయంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని సూచిస్తారు. గర్బిణిలో ఈ లక్షణాలు కనిపిస్తే తప్పని సరిగా వైద్యులను సంప్రదించాలి.


⦿ వికారం, వాంతులు, అసిడిటి వంటి సాధారణ  సమస్యలు గర్భిణీల రోజువారీ జీవితాన్ని ప్రబావితం చేస్తాయి. చాలా మందిలో సాధారణంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి కనుక తీవ్రంగా ఉంటే తల్లి, బిడ్డ ఇద్దరినీ ప్రభావితం చేసి డీ హైడ్రేషన్ వంటి సమస్యలకుదారి తీసే అవకాశం ఉంది. అందుకే ప్రారంభ దశలోనే వీటి పట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం.


⦿ మొదటి మూడు నెలలు పిండం గట్టి పడేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముందు నుంచి వైద్యుల పర్యక్షణలో ఉండాలి. గర్భిణీ బ్లడ్ గ్రూప్ నెగటివ్ గా ఉండి, భర్త బ్లడ్ గ్రూప్ పాజిటివ్ గా ఉంటే పుట్టే బిడ్డ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ తీసుకుంటే తీవ్రమైన సమస్యలు రావచ్చు. బిడ్డలో యాంటీ బాడీస్ ఏర్పడి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


⦿ HIV, హెపటైటిస్, క్షయవ్యాధి వంటి ఇన్ఫెక్షన్లు గర్భిణీ స్త్రీలు, శిశువులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. రోగి సరైన పరీక్షలు చేయించుకున్నట్లయితే ముందస్తుగా రోగనిర్ధారణ, చికిత్స, టీకా సహాయం చేస్తుంది.


⦿ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI), ఇతర సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ముందస్తు రోగ నిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకోవడం చాలా అవసరం.


⦿ గర్భధారణ సమయంలో మధుమేహం, ప్రసవించే సమయంలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముందస్తుగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


⦿ 37 వారాల కంటే ముందే ఉమ్మనీరు పడటం, ప్రసవం నొప్పులు రావడం ప్రమాదకరం. అటువంటి సమయంలో తల్లి, బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఇద్దరి ప్రాణాలను రక్షించగలిగే అత్యుత్తమ హాస్పిటల్ కి చేరుకోవడం ఉత్తమం.


⦿ ప్రసవించిన తర్వాత అకస్మాత్తుగా ఎక్కువగా రక్త స్రావం అయితే అధిక ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే బిడ్డని కనడం అంటే స్త్రీకి పునర్జన్మ అని అంటారు. గర్భిణిగా ఉన్న సమయంలో ఆరోగ్యకరమైన పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బరువు తగ్గాలన్నా, జుట్టు పెరగాలన్నా అంజీరా తినెయ్యండి - మరెన్నో ప్రయోజనాలు


Also read: ఇలా చేస్తే గుండె పోటు, మెదడు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 70 శాతం తగ్గించుకోవచ్చు, ఏం చేయాలంటే