రోజుల్లో మధుమేహం లేనివారంటూ ఎవరూ లేరు. జీవనశైలిలో మార్పుల వల్ల చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్నారు.  ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే ఇక దాన్ని నివారించలేం. కానీ అదుపులో ఉంచుకోవచ్చు. ఎంతో మంది యువకులు, వృద్ధుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.


డయాబెటిస్ మూడు రకాలు. టైప్ 1, టైప్ 2, గెస్టేషనల్ డయాబెటిస్ (గర్భధారణ సమయంలో వచ్చేది). ఆహారం, మందుల ద్వారా షుగర్ లెవల్స్ కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. లేదంటే అది అనేక రకాల వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఆవరణ, ధాతుక్షయ అని పిలుస్తారు. కఫ, పిత్త వంటి శ్లేష్మ దోషాలతో పాటు ఆమా (టాక్సిన్స్) ఇన్సులిన్ స్రావాన్ని అడ్డుకుంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేలా చేస్తుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయులు నాడీ వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇది కొంతమందికి తీవ్రంగా ఉంటుంది. కానీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం అధిక చక్కెర స్థాయిలు శరీరం జీర్ణవ్యవస్థ పనితీరుని దెబ్బతీస్తాయి. అందుకే ఈ ఆయుర్వేద చిట్కాలతో ఆరోగ్యంగా జీవించొచ్చు.


ఆహారంలో మార్పులు


⦿ డయాబెటిస్ రోగులు తమ రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే సులభంగా షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవచ్చు. అందుకోసం ఆహారంలో మెంతి గింజలు, జామున్, ఉసిరి ఉండేలా చూసుకోవాలి. మెంతి గింజల్లో ఉండే గెలాక్టోమన్నన్ అనే పదార్ధం జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. కార్బోహైడ్రేట్ల శోషణ తగ్గిస్తుంది. ఇక జామున్ (నేరేడు పండ్లు) తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు నేరుడు తీసుకోవడం మంచిది. రోజంతా 4-5 నేరుడు ఆకులని నమలడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.


⦿ ఇక ఉసిరిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్-C పుష్కలంగా లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి బాగుంటుంది. ఉసిరిలోని క్రోమియం కంటెంట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఉసిరి పొడిని గోరు వెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపున తాగితే మధుమేహులకి చాలా మేలు చేస్తుంది. దీని మెరుగైన ఫలితాలు పొందాలంటే ఉసిరి ఉడికించకుండా తినాలి.


⦿ ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వేపాకులు కూడా రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉండేందుకు దోహదపడతాయి. రోజు 3-4 వేపాకులు నోట్లో వేసుకుని నమిలి మింగడం మంచిది.


⦿ చేదుగా ఉండే కాకరకాయ కూడా మధుమేహులకి మంచిది. కాకరకాయ, ఉసిరి జ్యూస్ చాలా మంచిది. ఇవి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. వీటితో పాటు శరీరానికి తగిన శ్రమ ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్ వంటివి చేయడం కూడా మంచి ఫలితాలని ఇస్తాయి.


⦿ రోజు తినే ఆహారంలో అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. తక్కువ కెలోరీలు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలు ఎంచుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: చలికాలంలో అలోవెరా జెల్ రాసుకున్నారంటే ఈ చర్మ సమస్యలన్నీ దూరం