ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘అవతార్-2’. ఈ మూవీ డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. దాదాపు 52,000 స్క్రీన్‌లపై సినిమా చరిత్రలో ఎన్నడూ లేని భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. అయితే, ‘అవతార్-2’ మూవీ యూనిట్.. ముందుగానే మన సెలబ్రిటీల కోసం ప్రత్యేక షో వేశారు. ఇందులో బాలీవుడ్ నటీనటులంతా పాల్గొన్నారు. అక్షయ్ కుమార్ సైతం ఈ మూవీని చూశారు. అనంతరం ట్విట్టర్ ద్వారా తన రివ్యూను అభిమానులతో పంచుకున్నారు. 


కామెరూన్ ప్రతిభకు తలవంచుతున్నా- అక్షయ్ కుమార్


“అవతార్-2 సినిమా చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు ఇంప్రెస్ అయ్యాను. నిన్న రాత్రి ‘Avatar The Way Of Water’ సినిమాను చూశాను. మూవీ చూస్తూ మంత్ర ముగ్దుడినైపోయాను. జేమ్స్ కామెరూన్ మేథో సంపత్తికి తలవంచుతున్నా” అంటూ ‘అవతార్-2’ సినిమాపై పొగడ్తలు వర్షం కురిపించారు. ఈ మేరకు అక్షయ్ కుమార్ ఓ ట్వీట్ చేశారు.





అవతార్-2’ కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్


మూవీ లవర్స్‌ అంతా ఈ విజువల్ వండర్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అవతార్‌-2’ ట్రైలర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేమ్స్‌ కామెరాన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఎలాంటి అద్భుతాన్ని చేస్తారో చూడాలి అనుకుంటున్నారు. ‘అవతార్’కు మించి ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.  


అవతార్-2’ ఓపెనింగ్స్ పై ట్రేడ్ వర్గాల భారీ అంచనా


‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అనే సినిమా.. కామెరాన్  2009లో విడుదల చేసిన బ్లాక్ బస్టర్ ‘అవతార్’కు సీక్వెల్ గా వస్తోంది. ‘అవతార్’ మూవీ ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ‘అవతార్’ను మొత్తం 5 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రెండు కంప్లీట్ అయ్యాయి. ‘అవతార్-2’ సినిమా తొలిరోజే $525 మిలియన్లు వసూలు చేసి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా సాధించే వసూళ్ల మీద ఆధారపడి మిగతా భాగాల రూపకల్పన ఉంటుందని కామెరూన్ తెలిపారు.



Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు