వండిన కూరలు ఏవైనా మిగిలితే ఫ్రిజ్ లో పెట్టుకుని తెల్లారి వేడి చేసుకుని తింటారు. నాన్ వెజ్ వంటకాల విషయంలో ఎక్కువ మంది ఇదే ఫాలో అవుతూ ఉంటారు. కూర మిగిలిపోతే పదే పదే వేడి చేసుకుని తింటారు. అలా చేయడం వల్ల ఆహారం రుచి, ఆకృతి కూడా పాడవుతుంది. కొన్నిసార్లు ఎక్కువగా వేడి చేయడం వల్ల అది మాడిపోతుంది కూడా. మిగిలిపోయిన ఆహారాన్ని తప్పుగా వేడి చేయడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని వంటలు మాత్రం చేసిన రోజు కంటే మరుసటి రోజు బాగా రుచిగా ఉంటాయి. అది ఎందుకో తెలుసా రీహీట్ చేయడం వల్లే. సరైన ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని వేడి చేయడం వల్ల క్రిములు చనిపోవడమే కాకుండా దాని రుచి కూడా అలాగే ఉంటుంది. అది ఎలాగో తెలుసా?


వేడి చేసే ముందు ఇలా చెయ్యాలి
ఆహారాన్ని వేడి చేయడం అంటే కేవలం 30 సెకన్లు లేదా బాగా వేడి ఉండేలా చేసుకోవడం కాదు. వేడి చేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచకుండా వెంటనే తినెయ్యాలి.  భోజనం చేస్తామని అనుకున్నప్పుడు కొన్ని గంటల ముందే ఫ్రిజ్ లో పెట్టిన ఆహారాన్ని బయటకి తీసి ఉంచాలి. దాన్ని గది ఉష్ణోగ్రత తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మైక్రోవేవ్ లేదా పాన్ లో వేడి చేసుకోవాలి. వేడిగా ఉన్న ఆహారం కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కవర్ చేసి పెట్టాలనే విషయం గుర్తుంచుకోవాలి.


మళ్ళీ మళ్ళీ వేడి చెయ్యొద్దు
మిగిలిపోయిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడిచేసినప్పుడు ఆహారం దాని పోషకాలను కోల్పోతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ అవకాశాలని పెంచుతుంది. ఆహారాన్ని కూడా ఒకసారి సరైన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వేడి చేయాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.  


ఆ ఆహారం మళ్ళీ వేడి చేయడం కీలకం 
ఫ్రిజ్ లో పెట్టిన ఆహారం కొన్నిసార్లు ఐస్ ముక్కలుగా అయిపోతుంది. అలా ఉన్న ఆహారం మళ్ళీ వేడి చేయడం సురక్షితం. ఘనీభవించిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేయడం పెద్ద సవాలు. ఎందుకంటే అది వేడి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే దాన్ని సరిగా వేడి చెయ్యడానికి ముందు కరిగించుకోవాలని నిర్ధారించుకోవాలి. సక్రమంగా ఉడికించాలి. అప్పుడే అది సాధారణ స్థితికి వస్తుంది. 


మైక్రోవేవ్ లో చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ఆహారం వేడి చేయడం చాలా సులభం. అలా చేయడం వల్ల ఆహారం కూడా చక్కగా వేడి అవుతుంది. అయితే అన్నీ ఆహారాలు మైక్రోవేవ్ లో వేడి చేయడం మంచిది కాదు. నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు, కూరగాయలు, కోల్డ్ మీట్ వంటివి వేడి చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కూరగాయలు వేడి చేసే అలవాటు ఉంటే అది అసలు మంచిది కాదు. ఎందుకంటే రేడియేషన్ రూపంలో అధిక వేడి కూరగాయాల్లోని పోషకాలని హరించివేస్తుంది. అందుకే వాటిని ఓవెన్ లో పెట్టి వేడి చెయ్యకూడదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: బెల్లీ ఫ్యాట్ కరిగిపోవాలా? ఈ ఆహారపు అలవాట్లతో అది చాలా సింపుల్