మినప్పప్పు గారెలనే ఎక్కువగా చేస్తుంటారు. వాటిని తిని తిని బోరు కొడితే ఓసారి ఇలా మూడు రకాల పప్పులతో కలిపి గారెలు చేసుకుని తినండి. చాలా టేస్టీగా, నాలికకు కొత్తగా ఉంటాయి. ఇవి బ్రేక్ ఫాస్ట్‌గానే కాదు, సాయంత్రం సమయంలో స్నాక్‌గా కూడా బావుంటాయి. ఒక్కసారి చేసుకుని తింటే మళ్లీ మళ్లీ మీరే వండుకుని తింటారు. ముఖ్యంగా ఈ గారెల తయారీలో మూడు రకాల పప్పులు వాడతాం కాబట్టి పిల్లలకు ఇవి చాలా నచ్చుతాయి. 
 
కావాల్సిన పదార్థాలు
మినప్పప్పు - యాభై గ్రాములు
శెనగ పప్పు - యాభై గ్రాములు
పెసర పప్పు - యాభై గ్రాములు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చి మిర్చి - రెండు
పుదీనా ఆకులు - గుప్పెడు
మెంతులు - పావు చెంచా
పసుపు - చిటికెడు
కారం - పావు చెంచా
కరివేపాకులు - రెండు రెమ్మలు
మిరియాల పొడి - పావు చెంచా
గరం మసాలా - పావు చెంచా
వెల్లుల్లి రెబ్బలు - పది
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడినన్ని
నూనె - డీప్ ఫ్రైకు సరిపడా


తయారీ ఇలా
1. మూడు రకాల పప్పులను  నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని రుబ్బుకోవాలి. మరీ పేస్టులా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.  
2. ఒక గిన్నెలోకి పిండిని వేసి, అందులో ఉప్పు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బల తరుగు, కారం, పసుపు, పుదీనా ఆకులు, కరివేపాకులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. 
3. ఉల్లిపాయలను సన్నగా తరుక్కుని వాటిని కూడా కలపాలి. గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. 
4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కాక కొద్దిగా పిండిని తీసుకొని గారెల్లా చేత్తోనే ఒత్తుకొని నూనెలో వేయాలి.
5. చేతికి అంటుకోకుండా పిండి రావాలంటే, ముందుగా చేతికి నీళ్లు కానీ నూనె కానీ రాసుకోవాలి. 
6. గారెలు బంగారు రంగులోకి వచ్చే వరకు ఉంచి, తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
7. కొబ్బరి చట్నీతో వీటిని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ లేకపోయినా కూడా ఇవి తినవచ్చు. 


మెత్తగా రావాలంటే...
గారెలు కొందరు వేస్తే చాలా గట్టిగా వస్తాయి. నూనె పీల్చేసుకుంటాయి. అలా కాకుండా గారెలు నూనె పీల్చుకోకుండా, మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. నానబెట్టిన పప్పులను ఫ్రిజ్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉంచాలి. గారెలు వేయడానికి ముందు ఫ్రిడ్జ్ లోంచి తీసి రుబ్బుకోవాలి. రుబ్బినప్పుడు నీళ్లు చిలకరిస్తారు కదా అవి కూడా చల్లని నీటినే వాడాలి. రుబ్బినప్పుడే ఉప్పు వేయకుండా, రుబ్బిన తర్వాత ఆ పిండిలో ఉప్పు కలుపుకోవడం మంచిది. అలాగే రుబ్బిన పిండిలో బియ్యప్పిండిని కాస్త కలిపితే, గారెలు మృదువుగా వస్తాయి. ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వంటివి ముందే కలిపేయకుండా... గారెలుగా వేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందు మాత్రమే పిండిలో కలపాలి. ముందుగానే కలిపి ఉంచితే నూనె పీల్చేసే అవకాశం ఉంది. ఈ చిట్కాలన్నీ పాటిస్తే గారెలు నూనె పీల్చుకోకుండా మృదువుగా వస్తాయి. 


Also read: మనదేశంలో సగ్గుబియ్యాన్ని పరిచయం చేసింది ఆ మహారాజే, వీటిని ఎలా తయారు చేస్తారంటే